
గజ్వేల్, వెలుగు: పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నవాబ్ మజాహిద్ఆలం ఖాన్, చనగని దయాకర్, కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం వర్గల్, తునికి ఖల్సా, మినాజీ పేట, జబ్బాపూర్, శేరిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ కాపీలు అందజేసినట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. హౌసింగ్ డీఈ శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు విజయ మోహన్, ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.