
- ముగ్గురిపై కేసు నమోదు
వెంకటాపురం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి అక్రమంగా పశువులను కబేళాకు తరలిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టగా పశువులు చనిపోయాయి. వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని రాచపల్లి గ్రామ సమీపంలోని పాలెం వాగు పంట కాలువలో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది. సంఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా.. డీసీఎం వాహనంలో 14 ఆవులు, ఎద్దులు కట్టిసి ఒకదానిపై ఒకటి పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 8 పశువులు మరణించగా, 6 బతికి ఉన్నాయని తెలిపారు.
వెటర్నరీ అసిస్టెంట్ తో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చనిపోయిన పశువులను వీఆర్కే పురం గ్రామ సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశామన్నారు. ప్రాణాలతో ఉన్న పశువులను గోశాలకు తరలించినట్లు చెప్పారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించామన్నారు. ఎటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వనపర్తి బాలకృష్ణ, మహా ముత్తారం గ్రామానికి చెందిన హాట్కార్ అర్జున్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.