కరోనాతో ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
అప్పటికే 6.50 లక్షల బిల్లు చెల్లింపు
పైసా లేవని ఉంచుకోమన్నకుటుంబ సభ్యులు
చివరికి 20 వేలు తీసుకొని డెడ్బాడీ అప్పగింత
హైదరాబాద్, వెలుగు: ఓ యువకుడు కరోనాతో కార్పొరేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతిచెందాడు. అప్పటికే కట్టిన బిల్లు కాకుండా మరో 5 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన నవీన్కుమార్(28), అనారోగ్యంతో గత నెల 23న సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చేరాడు. 24న కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. మళ్లీ 26న మరోసారి టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడంతో అక్కడే ట్రిట్మెంట్ తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయాడు. అప్పటికే కుటుంబ సభ్యులు6.50 లక్షల బిల్లు చెల్లించారు. మరో 5లక్షలు వెంటనే కట్టాలంటూ ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తమ వద్ద చిల్లిగవ్వ లేదని, డెడ్బాడీ తమకు వద్దని, మీరే ఉంచుకోవాలని ఆస్పత్రి వర్గాలకు తెలిపారు. దిగొచ్చిన మేనేజ్మెంట్ 20 వేలు కట్టించుకొని మృతదేహా న్ని ఫ్యామిలీ మెంబర్స్కు అప్పగించగా, ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
బిల్లు కట్టమని వేధింపులు.. పత్తాలేని కుటుంబ సభ్యులు
సికింద్రాబాద్ గాస్మండీకి చెందిన 55 ఏండ్ల వ్యక్తి మోండా మార్కెట్లో కూరగాయల చిరు వ్యాపారి. కరోనా సింటమ్స్తో ప్యారడైజ్ ఏరియాలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో గత నెల 13న చేరాడు. టెస్ట్ల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మొత్తం 13 లక్షల బిల్లు కాగా, బీమాతో పాటు అదనంగా రూ 5 లక్షలు చెల్లించారు. ఇంకా పెండింగ్ బిల్లు కట్టాలని ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. అసలు పేషెంట్ బతికి ఉన్నాడో లేదో చూపించడం లేదని ఆరోపిస్తూ.. రూ 8లక్షలు చెల్లిస్తేనే చూపిస్తామని డాక్టర్లు అంటున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల కిందట 3 లక్షలు కడతామని చెప్పిన పేషెంట్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు మళ్ళీ ఆసుపత్రికి రాలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నాయి.