- పర్మిషన్లు లేకుంటే అప్పులు డౌటే
- ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్ల రుణాలపై డైలమా
- వచ్చే ఏప్రిల్లోగా పర్మిషన్లు తప్పనిసరి
- సీతమ్మసాగర్ లోన్పై ఇప్పటికే సవరణ ఉత్తర్వులు
- కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, పాలమూరుకు తప్పని రుణ బాధలు
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టులకు లోన్ల గండం పట్టుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని పర్మిషన్లు తీసుకోకుంటే ఆయా ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన లోన్లు వెనక్కి వెళ్లే ప్రమాదముంది. మొత్తం రూ. 25 వేల కోట్లకు పైగా లోన్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లు 9 నెలల్లోనే సమర్పించి అన్ని రకాల పర్మిషన్లు తీసుకోవడం కష్టమేనని ఇరిగేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందితే గండం గట్టెక్కొచ్చని అనుకున్నా అందుకు ఏపీ ఒప్పుకుంటుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ సాగర్ బ్యారేజీకి పర్మిషన్లన్నీ రాకుంటే లోన్ వెనక్కి తీసుకునేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సవరణ ఉత్తర్వులు ఇచ్చేలా చేసింది. మున్ముందు ఇదే పరిస్థితి కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, పాలమూరు, సీతారామ ఎత్తిపోతలకు ఎదురు కావచ్చు.
అప్పుల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు
ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రుణ సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి కాళేశ్వరంతోపాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టుకు అప్పులు తీసుకుంటోంది. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి దేవాదుల, ఎస్సారెస్పీ వరద కాలువ, సీతారామ, సీతమ్మసాగర్ బ్యారేజీలకు అప్పులు తెస్తోంది. నాబార్డు, ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సార్షియం, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఈ కార్పొరేషన్లకు లోన్లు ఇస్తున్నాయి. నాబార్డు, బ్యాంకులకు మించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ భారీ మొత్తంలో అప్పులిచ్చాయి.
మొత్తం అప్పు రూ.60 వేల కోట్లకు పైనే
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులకు ఆర్ఈసీ నుంచి రూ.27,310 కోట్లు, పాలమూరుకు పీఎఫ్సీ నుంచి రూ.11,915 కోట్లు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి పీఎఫ్సీ నుంచి రూ.3,481 కోట్లు, సీతారామ ఎత్తిపోతలు, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టులకు కలిపి రూ.12 వేల కోట్ల అప్పులు వచ్చాయి. ఈ ప్రాజెక్టులకు ఫైనాన్స్ సంస్థల నుంచి ఇరిగేషన్ కార్పొరేషన్లు రూ. 60 వేల కోట్ల అప్పులు తీసుకున్నాయి. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీకి రూ.20 వేల కోట్ల వరకు లోన్ గ్రౌండింగ్ అయింది. పాలమూరుకు రూ. వెయ్యి కోట్ల వరకు లోన్ ఇచ్చారు. 35 వేల కోట్ల వరకు లోన్లు కార్పొరేషన్లకు జమయ్యాయి. 25 వేల కోట్లు రావాల్సి ఉంది. ప్రాజెక్టులకు పర్మిషన్లు రాకుంటే ఈ అప్పులు జమ కావడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.
పర్మిషన్లే అసలు సమస్య
ప్రాజెక్టులకు పర్మిషన్ రావాలంటే హైడ్రాలజీ క్లియరెన్స్ తప్పనిసరి. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ సాధ్యం కాదు. సీతారామ ఎత్తిపోతలకు అనుమతుల కోసం గతంలో ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులన్నీ వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్నవే. హైడ్రాలజీ క్లియరెన్స్ లేకుండా సీడబ్ల్యూసీ వీటికి ఆమోదం ఇవ్వదు. క్లియరెన్స్లకు ఉన్న ఏకైక మార్గం అపెక్స్ కౌన్సిల్. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలోని ఈ కమిటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులు. అపెక్స్ కౌన్సిల్ ఈ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలంటే ఏపీ సీఎం సమ్మతి తప్పనిసరి. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఏపీ కంప్లైంట్లు చేస్తుండటంతో ఇది అసాధ్యం. ఆయా ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలోనే కేంద్రం హెచ్చరిక
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి సహా పర్మిషన్ లేని ప్రాజెక్టులకు లోన్లు మంజూరు చేయడంపై ఆర్థిక సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరింది. ఈ మేరకు నిరుడు డిసెంబర్లో కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విభాగం పీఎఫ్సీ, ఆర్ఈసీ చైర్మన్లకు లేఖలు రాసింది. పర్మిషన్ లేని ప్రాజెక్టులకు లోన్లు ఎలా ఇస్తున్నారో చెప్పాలంది. దీంతో సీతమ్మ సాగర్ బ్యారేజీకి లోన్ ఇవ్వడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొర్రీలు పెట్టింది. ప్రాజెక్టుకు పర్మిషన్లు రాకుంటే లోన్ వెనక్కి తీసుకునేలా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ఒత్తిడి చేసింది. మిగతా రుణాలపైనా ఇలాగే ఒత్తిడి చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.