
హైదరాబాద్, వెలుగు: దక్కన్ క్లబ్ సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ‘ దక్కన్ క్లబ్ తెలంగాణ స్టేట్ ఎలైట్ ఇన్విటేషన్ చెస్ చాంపియన్ షిప్ – 2023 జరగనుంది. ఈ నెల 9 ,10 తేదీల్లో ఈస్ట్ మారేడ్పల్లిలోని దక్కన్ క్లబ్ లో నిర్వహించనున్నట్లు క్లబ్ కమిటీ తెలిపింది. గురువారం మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు బి .అనిల్ కుమార్, కార్యదర్శి ఎం.ఎస్ శ్యామ్ ,ఉపాధ్యక్షుడు ఎ. ముఖేష్, ట్రెజరర్ ఎం. వెంకటేశ్వర్లు, రాష్ట్ర స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
వందేండ్ల చరిత్ర ఉన్న ఈ క్లబ్ పలు క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు చెస్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. చీఫ్గెస్టుగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, గౌరవ అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ హాజరై ప్రారంభోత్సవం చేస్తారని పేర్కొన్నారు. ఆదివారం ముగింపు కార్యక్రమం రోజున బహుమతి ప్రదానోత్సవం చేస్తారని చెప్పారు. ప్రముఖ క్రీడాకారులు సమీర్ హర్ష చిద్విలసాయి,
పవన్ కార్తికేయ, శ్రీరామ్ఆదర్శ్, ఉప్పల చల్లా సహస్ర భవిష్క, సరయు, కీర్తి గంట అభిరామి, మోడిపల్లి దీక్షిత సంహిత, అంకిత గౌడ్ లాంటి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. చెస్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని దక్కన్ క్లబ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కె. నర్సయ్య వ్యక్తంచేశారు. భవిష్యత్ లో మరిన్ని క్రీడలు నిర్వహించేందుకు కార్యవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు.