నిజామాబాద్ జిల్లాలో..తగ్గిన పోలింగ్​ శాతం

నిజామాబాద్ జిల్లాలో..తగ్గిన పోలింగ్​ శాతం
  •     అర్బన్, బాల్కొండలో నిరాశాజనకం​ 
  •     మిగితా ఏడు సెగ్మెంట్లలో మరింత తగ్గుదల
  •     రిజల్టివ్వని ఆఫీసర్ల అవగాహన ప్రోగ్రామ్స్


నిజామాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను ప్రస్తుత ఎలక్షన్​తో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. పల్లెల కంటే పట్టణాల్లో ఓటింగ్​శాతం బాగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని విద్యావంతులే పోలింగ్​కు దూరంగా ఉంటున్నారు. 

అర్బన్, బాల్కొండ మారలే..

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్​అర్బన్ ​సెగ్మెంట్​లో ఓటర్ల సంఖ్య అధికం. మొత్తం 2,94,832 మంది ఓటర్లు ఉండగా 1,81,808 మంది ఓటేశారు. 61.66 శాతంగా పోలింగ్​నమోదైంది. 2018లో కూడా ​62.65 శాతంగా పోలింగ్ జరిగింది. ఈసారి ఓటింగ్​శాతాన్ని పెంచడానికి ఆఫీసర్లు ప్రయత్నించినా, పెద్దగా ఫలితం రాలేదు. గతంలో కంటే ఒకశాతం ఓటింగ్​తగ్గింది. బాల్కొండలో మొత్తం 2,21,445 మంది ఓటర్లకు 1,76,586 మంది మాత్రమే ఓటు వేశారు. పోలింగ్​79.74 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో ఇది​79.70 శాతంగా ఉండగా, ఈసారి పెద్ద మార్పులేదు.  

మిగతా చోట్ల..

ఆర్మూర్​నియోజకవర్గంలో మొత్తం 2,10,217 ఓట్లలో 1,59,804 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్​76.02 శాతం నమోదైంది. 2018లో 79.08 శాతం ఉన్న పోలింగ్​ఇప్పుడు తగ్గింది. బోధన్​ సెగ్మెంట్​లోని మొత్తం 2,20,068 ఓటర్లలో 1,71,247 మంది మాత్రమే ఓటేశారు. 2018లో 81.34 శాతంగా ఉన్న పోలింగ్​ఈ ఎన్నికల్లో 77.92 శాతానికి పడిపోయింది. రూరల్​ సెగ్మెంట్​లో కూడా గత ఎన్నికల్లోని 84.10 శాతంతో పోలిస్తే 8 శాతం తగ్గి ఈ సారి 76.42 శాతంగా నమోదైంది.2,53,233 మంది ఓటర్లలో 1,93,556 మాత్రమే ఓటేశారు. కామారెడ్డిలో 2018లో 78.83 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 75.58 శాతానికి పడిపోయింది.

మొత్తం 2,52,460 ఓట్లలో 1,90,811​ ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ 78.83 శాతం పోలింగ్​నమోదైంది. ఎల్లారెడ్డిలో మొత్తం2,20,531 ఓట్లలో 1,83,414 మాత్రమే ఈవీఎంలో పడ్డాయి. 83.17 శాతం పోలింగ్​ నమోదుకాగా 2018 ఎన్నికల్లో ఈ శాతం 86.32గా ఉంది. జుక్కల్​ సెగ్మెంట్​లో గత ఎన్నికల 85.56 శాతంగా ఉండగా ఈసారి 81.80 శాతం మాత్రమే వచ్చింది. మొత్తం 1,99,962 మంది ఓటర్లకు 1,63,569 మంది ఓటేశారు.