
ఢిల్లీలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న రికవరీలు
టెస్టులు, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ పై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం
న్యూఢిల్లీ, వెలుగు: కొన్ని రోజుల కిందటి దాకా ఢిల్లీలో కేసులు భారీగా వచ్చాయి. ఒకానొక టైంలో జులై చివరి నాటికి ఐదున్నర లక్షల కేసులొస్తాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పారు కూడా. కానీ, ఇప్పుడు అక్కడ కేసులు నెమ్మదించాయి. ఒక టైంలో ఒక్క రోజులో 4 వేలదాకా వచ్చిన కేసులు..ఇప్పుడు వెయ్యికి పడిపోయాయి. కారణం, అక్కడ కరోనా కట్టడికి ఆరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే. టెస్టులు, ట్రీట్మెంట్, కంటెయిన్మెంట్ వంటి అంశాల్లో కేజ్రీవాల్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుని సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటూ ముందుకు వెళుతోంది. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. టెస్టులు, ట్రీట్మెంట్ విషయంలో మన సర్కార్ ఇంకా వెనకబడే ఉంది. రోజూ ఇస్తున్న బులెటిన్లలోనూ తప్పుడు లెక్కలే ఉంటున్నాయి. దీంతో జనాల్లో భయం రోజురోజుకూ పెరుగుతోంది.
ఇంట్లో సీరియస్ అయితే..వెంటనే హాస్పిటల్ కు
ఢిల్లీలో మొదట్లో రోజూ 5 వేల టెస్టులే చేసేవారు. ఇప్పుడు అది 23 వేలకు పెరిగింది. జులై చివరి నాటికి ఐదున్నర లక్షల కేసులు నమోదయ్యే ముప్పుందని గతంలో డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు. బాధితుల ట్రీట్మెంట్ కోసం 80 వేల బెడ్లు అవసరమని భావించారు. అయితే పకడ్బందీ చర్యలతో జులై 15 నాటికి లక్షన్నర కేసులే వచ్చాయి. మరణాలు రేటు కూడా భారీగానే తగ్గింది. కరోనా నుంచి కోలుకుంటున్నోళ్లు 86 శాతం దాకా ఉన్నారు. కరోనా కట్టడి కోసం దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్. లక్షణాలు తక్కువగా ఉన్నోళ్లకు, లక్షణాలు లేని వాళ్లకు ఆక్సీమీటర్లు ఇచ్చి ఇంటి వద్దే ట్రీట్మెంట్ చేయిస్తోంది. అయితే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినోళ్లను వెంటనే హాస్పిటళ్లకు తీసుకెళ్లేలా అంబులెన్సులు, మెడికల్ టీంలను సదా సిద్ధంగా ఉంచింది. దీంతో మరణాలను చాలా వరకు తగ్గించగలిగింది.
ఇంట్లో ఉంటే పట్టించుకునేటోడు లేడు
మొదట్లో టెస్టుల్లో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది తెలంగాణ. నేషనల్ మీడియా కూడా పరిస్థితిని ఎత్తి చూపడంతో కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అయితే, అప్పటికప్పుడు హడావుడి చేసినా ఆ తర్వాత మళ్లీ మామూలే. కొన్ని నెలలు గడిచాక ప్రైవేటుకు అనుమతిచ్చింది. ఒక్కరోజే 2 వేల దాకా కేసులొచ్చాయి. దీంతో మళ్లీ టెస్టులపై కంట్రోల్ పెట్టింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వసతులనూ ఏర్పాటు చేయలేదు. కరోనా పేషెంట్లకు అది నయం కాకముందే ఇష్టమొచ్చినట్టు డిశ్చార్జి చేసింది. కనీసం అంబులెన్సునూ ఏర్పాటు చేయలేదు. దీంతో వాళ్లు, ఆటోలు , క్యాబుల్లోనే ఇళ్లకు వెళ్లారు. తక్కువ లక్షణాలున్నోళ్లకు ఇంటి వద్దే ట్రీట్ మెంట్ చేస్తున్నా.. సరైన గైడెన్స్ కూడా లేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఇంట్లో ఆక్సిజన్ అందక కొందరు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. సీరియస్ గా ఉన్నోళ్లనూ ఆస్పత్రుల్లో చేర్చుకోలేని పరిస్థితి ఉంది. ఇటు మరణాల వెల్లడిలోనూ అంతా గందరగోళమే.