డీసెట్ రిజల్ట్ వచ్చిన మూడున్నర నెలలకు అడ్మిషన్​ కౌన్సెలింగ్

డీసెట్ రిజల్ట్ వచ్చిన మూడున్నర నెలలకు అడ్మిషన్​ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌‌‌‌ నిర్లక్ష్యంతో డీఈడీ కాలేజీలు మూతపడుతున్నాయి. డీఎడ్‌‌ అడ్మిషన్ కౌన్సెలింగ్‌‌ ప్రక్రియను ఆలస్యంగా నిర్వహించడంతో చాలా మంది స్టూడెంట్లు ఇతర కోర్సుల్లో చేరిపోయారు. దీంతో తమ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయో లేదోనని మేనేజ్‌‌మెంట్లు కాలేజీలను మూసేస్తున్నాయి. డీఎడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చిన మూడున్నర నెలల తర్వాత అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే కౌన్సెలింగ్ లేట్‌‌ అవడంతో చాలామంది స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చేరిపోయారు. దీంతో తమ కాలేజీలలో సీట్లు నిండుతాయో.. లేదోనని 40 కాలేజీల మేనేజ్‌‌మెంట్లు కౌన్సెలింగ్‌‌లో పాల్గొనబోమని అధికారులకు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌‌ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం 4 రోజుల కింద స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 10న సీట్ల అలాట్‌‌మెంట్‌‌, 15లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. డిసెంబర్ 17 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. అయితే, ఆగస్టు ఫస్ట్ వీక్‌‌లోనే డీసెట్ ఫలితాలు రిలీజ్ కాగా, ఇందులో 6,550 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. దాదాపు మూడున్నర నెలల తర్వాత అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వడంపై స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఈఆర్టీ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తున్నది. 

ఈ ఏడాది 40 కాలేజీలు తగ్గినయ్..

రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో 99 డీఈడీ కాలేజీలు ఉండగా, వాటిలో 6,888 సీట్లు ఉండేవి. వీటిలో 10 సర్కార్‌‌‌‌ కాలేజీల్లో 1,400 సీట్లు అందుబాటులో ఉండేవి. 2022–23 విద్యా సంవత్సరంలో కాలేజీల సంఖ్య 59కి తగ్గడంతో, సీట్ల సంఖ్య 4,600కు పరిమితమైంది. ఈ ఒక్క ఏడాదిలోనే 40 కాలేజీలు కౌన్సెలింగ్ నుంచి తప్పుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన డీఈడీ కాలేజీలు ఇప్పుడు ఏటా తగ్గుతున్నాయి. 2015లో 212 కాలేజీలుండగా, ప్రస్తుతం 59కి చేరాయి. డీఈడీ కాలేజీల్లో చేరే స్టూడెంట్లకు సర్కారు ఏటా రూ.12,500 ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇన్‌‌కం సర్టిఫికెట్ లేకుంటే రూ.2,385 చెల్లించేవారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు, ఎన్‌‌సీటీఈ నిబంధనలు అమలు చేయాలంటే ఈ ఫీజులతో కాలేజీలు నడపడం కష్టమేనని మేనేజ్‌‌మెంట్లు వాపోతున్నాయి. కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే కౌన్సెలింగ్ సమయానికి నిర్వహించలేదని ఓ కాలేజీ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రతినిధి ‘వెలుగు’తో చెప్పారు. దీంతో స్టూడెంట్లు.. డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరారన్నారు. ఇప్పుడు కౌన్సెలింగ్ పెడితే, వారు డీఈడీలో చేరుతారా..? ఇదంతా సర్కారు కావాలనే చేస్తున్నది ఆయన మండిపడ్డారు.