![డోపింగ్ టెస్టులో విఫలం..దీపా కర్మాకర్ పై 21 నెలలు నిషేధం](https://static.v6velugu.com/uploads/2023/02/Deepa-Karmakar-h_Wncga80Nob.jpg)
డోపింగ్ టెస్టులో విఫలమైన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల నిషేధం విధించింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు దీపా కర్మాకర్ను ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది. 2021 అక్టోబర్లో దీపా కర్మాకర్ కు నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు ఫలితం పాజిటివ్గా వచ్చింది. అయినా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. తాజాగా ఈ విషయం బయటపడటంతో ఆమెపై ఐటీఐ వేటు వేసింది. 2021 నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10 వరకు నిషేధం ముగుస్తుంది. ఇక దీపా కర్మాకర్ హైజెమిన్ S-3 బీటా-2 తీసుకున్నందుకు దోషిగా తేలింది. అంతర్జాతీయ డోపింగ్ ఏజెన్సీ హైజెమిన్ ఎస్-3 బీటా-2ను నిషేధిత ఔషధాల కేటగిరీలో చేర్చింది.
2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్లో వాల్ట్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్ నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే 2017లో కాలి గాయం వల్ల జిమ్నాస్టిక్స్కు దూరమైంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి కోలుకోలేదు. చివరి సారిగా 2019లో బాకులో జరిగిన ప్రపంచ కప్ ఈవెంట్లో పాల్గొంది. తాజాగా నిషేధంతో దీపా అపారటస్ వరల్డ్ కప్ సిరీస్తో పాటు కనీసం మూడు వరల్డ్కప్ సిరీస్లకు కూడా దీప దూరం కానుంది. అయితే సెప్టెంబర్ 23 నుంచి ఆంట్వెర్ప్లో జరగనున్న వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.