నేటి డిజిటల్ యుగంలో అరచేతిలోకి అన్నీ అంది వచ్చేస్తున్నాయి. ఒక క్లిక్తో ఆహారం, మరో క్లిక్తో నిత్యావసరాలు నిమిషాల్లో ఇంటి తలుపు తడుతున్నాయి. ఈ సౌలభ్యం వెనుక వేల సంఖ్యలో డెలివరీ భాగస్వాముల చెమట చుక్కలు ఉన్నాయి. అయితే, ఈ ‘క్విక్ కామర్స్’ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న శ్రామికుల పరిస్థితి ‘దీపం కింద చీకటి’లా మారుతోంది. ఇటీవల జొమాటో, బ్లింకిట్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్, తమ ప్లాట్ఫామ్ పర్యావరణ వ్యవస్థ అత్యంత ‘న్యాయబద్ధంగా’ ఉందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. క్షేత్రస్థాయిలో డెలివరీ భాగస్వాములు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలకు, కార్పొరేట్ సంస్థల ప్రకటనలకు మధ్య ఉన్న అగాధాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి బయటపెట్టాయి.
భారతదేశంలో గిగ్ ఎకానమీ అనేది అతిపెద్ద ఉపాధి కల్పన యంత్రమని యాజమాన్యాలు గొప్పగా చెప్పుకుంటాయి. కానీ, ఈ పనులు ఎంతవరకు వ్యవస్థీకృతం అనేదే ప్రధాన ప్రశ్న. డెలివరీ భాగస్వాములు కంపెనీ రికార్డుల్లో ఉద్యోగులు కారు. వారు కేవలం ‘స్వతంత్ర కాంట్రాక్టర్లు’ లేదా ‘భాగస్వాములు’. ఈ హోదా వల్ల వారికి కనీస వేతనం, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఆరోగ్య బీమా వంటి ప్రాథమిక ప్రయోజనాలేవీ అందవు.
మరీ ముఖ్యంగా, వీరి ఆదాయం కంపెనీల ఏకపక్ష నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. గత సెప్టెంబరులో ఒక ఆర్డర్కు రూ. 22 నుంచి రూ.30 వరకు లభించే ప్రాథమిక వేతనం, నవంబర్ నాటికి రూ.15–-27కి, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రూ.10-–15కి పడిపోయింది. పెట్రోల్ ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో, వచ్చే అరకొర ఆదాయం వాహన మరమ్మతులకు, ఇంధనానికే సరిపోతుంటే, ఇక కుటుంబ పోషణ ఎలా సాధ్యమనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సమయంతో జూదం.. 10 నిమిషాల డెలివరీ ప్రమాదం
కార్మికుల ప్రధాన ఆవేదన ‘10 నిమిషాల డెలివరీ’ విధానం. వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు చేస్తున్న ఈ ప్రయోగం డెలివరీ ఏజెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పక్కనే ఉన్న ‘డార్క్ స్టోర్ల’ నుంచి వస్తువులు పంపడం సిద్ధాంతపరంగా సులభమే అనిపించవచ్చు. కానీ, భారతీయ నగరాల్లోని ట్రాఫిక్, ఇరుకైన సందులు, అస్థిరమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ సమయపాలన అసాధ్యం. ఈ ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వంటివి చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కంపెనీల మార్కెట్ వాటా పెరగడం కోసం శ్రామికుల ప్రాణాలను పణంగా పెట్టడం ఏ రకమైన సామాజిక బాధ్యత అని గిగ్ వర్కర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
సమ్మెలు, సంకెళ్లు
డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా డెలివరీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పండుగ రోజుల్లో అందరూ సంబరాలు చేసుకుంటుంటే, వీరు మాత్రం తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కారు. కానీ, ఇక్కడే ఒక విషాదకర వాస్తవం దాగి ఉంది. సమ్మె పిలుపు ఉన్నప్పటికీ, చాలామంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి వచ్చింది. ఇది వారు యాజమాన్యంపై ఉన్న ప్రేమతో చేసిన పనికాదు, కేవలం ఆకలి వేసే బాధ. ఒక్కరోజు ఆదాయం కోల్పోతే ఆ నెల గడవని పరిస్థితి వారిది. దీనిని ఆసరాగా చేసుకున్న సంస్థలు, పండుగ రాత్రి వేళల్లో ఒక్కో ఆర్డర్కు రూ.120-–150 వరకు ప్రోత్సాహకాలు ప్రకటించి, వారిని పనిలోకి లాక్కున్నాయి. ఇది ఒక రకమైన ‘ఆర్థిక వివక్ష’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్లు కొంతవరకు ఈ గిగ్ కార్మికుల వాస్తవికతను గుర్తించాయి. అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో 1 నుంచి 2 శాతం నిధులను సామాజిక భద్రతా నిధికి కేటాయించాలని ఇవి సూచిస్తున్నాయి. కానీ, ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమలులోకి రావాల్సి ఉంది. వ్యాపారవేత్తలు ‘రెడ్ టేపిజం’ (అధికారిక జాప్యం) గురించి మాట్లాడతారు కానీ, ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవడంలో విఫలమవుతున్నారు.
ఉద్యోగ అవకాశాలు లేని దేశంలో గిగ్ ఎకానమీ ఒక ఆశాకిరణం లాంటిదే. కానీ, ఆ కిరణం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి తప్ప, వారిని దహించకూడదు. కంపెనీల వృద్ధి, మార్కెట్ విలువ ముఖ్యం కావొచ్చు, కానీ అది వ్యవస్థను నడిపే మనుషుల సంక్షేమాన్ని బలితీసుకుని సాధించకూడదు. డెలివరీ ఏజెంట్లను ‘ఖర్చు’గా కాకుండా, నిజమైన ‘భాగస్వాములు’గా గుర్తించినప్పుడే వ్యవస్థకు గౌరవం ఉంటుంది. కేవలం మాటల్లో ‘న్యాయం’ అని చెబితే సరిపోదు, అది ఆ కార్మికుడు రోడ్డుపై ప్రతి ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు అనుభవించే ‘భద్రత’లో కనిపించాలి.
- వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్
