
దీవెనల దీపావళి ... దీపావళి పండుగ సమయంలో ఇచ్చే శుభాకాంక్షలు ఆశీర్వాదాలను సూచిస్తుంది. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం శ్రేయస్సు నింపాలని పూజలు చేస్తారు. పూర్వకాలంలో ఇలా చేసేందుకు ఓ సాంప్రదాయం ఉంది. రజకులు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు హారతి ఇచ్చిన తరువాతే స్నానం చేసి పూజలు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ ఆచారం కనుమరుగైంది. రజకులు హారతి ఇచ్చే సంప్రదాయం గురించి తెలుసుకుందాం. .
దీపావళి అనగానే అందరికీ పటాకులు కాల్చడమే గుర్తొస్తుంది. కానీ ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ రజకులు దీవెనలు ఇవ్వడంతో మొదలవుతుంది. పండుగ రోజు తెల్లవారు జామున రజక కులానికి చెందిన మహిళలు ఇంటికొస్తారు. ఇంట్లో వాళ్లందరికీ హారతిచ్చి నుదుట బొట్టు పెట్టి దీవిస్తారు. ఇంట్లో వాళ్లు వాళ్లను ఆడపడచులుగా భావించి ఖరీదైన బహుమతులు, డబ్బు ఇచ్చి పంపిస్తుంటారు. అలా హారతి తీసుకుంటే అంతా మంచే జరుగు తుందని నమ్ముతారు.
హారతి తీసుకుని బొట్టు పెట్టించుకున్న తర్వాతనే అందరూ స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకుంటారు. కొన్ని పల్లెల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతున్నప్పటికీ నగరాల్లో మాత్రం కనిపించడం లేదు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక... కాబట్టి దీవెనల దీపావళి అంటే జీవితాల్లో చీకటిని పారద్రోలి, వెలుగును నింపి అంతా మంచి జరగాలనే ఆశీర్వాదం కోసం పూజలు చేసి..సంతోషంగా టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారు.