
- స్పీకర్ నోటీసులు, సుప్రీంకోర్టు తీర్పుపై చర్చ
- నోటీసులపై స్పీకర్కు వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్ , వెలుగు: పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆదివారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు రేవంత్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్రెడ్డి సైతం పాల్గొన్నట్టు తెలుస్తున్నది. స్పీకర్ నోటీసులు, సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించినట్టు సమాచారం. సీఎంను కలిసినవారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డి ఉన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో.. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ సైతం ఇచ్చినట్లు తెలుస్తున్నది. స్పీకర్ నోటీసులు ఇస్తే వివరణ ఇవ్వాలని సీఎం అన్నట్టు సమాచారం. తాజాగా సీఎంతో సమావేశం అయిన సమయంలో నోటీసుల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది.