నిజాం కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్, వెలుగు: హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్ల నిరసన కొనసాగుతోంది. సోమవారం స్టూడెంట్లు శాంతియుత నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ అమ్మాయిలకు కాకుండా పీజీ స్టూడెంట్లకు హాస్టల్ కేటాయించడం సరికాదని, ప్రిన్సిపల్ తమకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఓల్డ్ స్టూడెంట్లు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
మరోవైపు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ స్టూడెంట్లు సోమవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో స్పందించారు. నిజాం కాలేజీలో యూజీ కోర్సులు చదువుతున్న 600 మంది అమ్మాయిలకు నిర్మించిన హాస్టల్ భవనాన్ని పీజీ విద్యార్థినులకు కేటాయించడం అన్యాయమన్నారు. ప్రశ్నిస్తున్న స్టూడెంట్లపై పోలీసు నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారని, ఇదేం న్యాయమని మండిపడ్డారు.