నత్తనడకన మెడికల్ కాలేజీ పనులు!

నత్తనడకన  మెడికల్ కాలేజీ పనులు!
  • నాలుగేండ్లుగా కొనసాగుతున్న బిల్డింగ్​ నిర్మాణం 
  • రూ. 540 కోట్లతో చేపట్టిన పనుల్లో కానరాని పురోగతి!
  • మూడేండ్లుగా నర్సింగ్​ కాలేజీలోనే మెడికల్​ కాలేజీ.. 
  • సొంత భవనం పూర్తి కాక 10 కిలో మీటర్ల దూరంలోని ప్రయివేట్​ హాస్టలే దిక్కు
  • ఇప్పటికీ మూడు బ్యాచ్​లు కంప్లీట్.. ఆగస్టులో కొత్త బ్యాచ్​ 
  • ఫండ్స్​ రాక పనులు స్లో... పై ఆఫీసర్లు దృషి పెట్టాలని విజ్ఞప్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని మెడికల్​ కాలేజీ నిర్మాణ పనులు నాలుగేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఫండ్స్ ​సరిగా రిలీజ్ ​కాక పనులు కావట్లేదు. నర్సింగ్​ కాలేజీ కోసం కట్టిన బిల్డింగ్​లోనే మెడికల్​ కాలేజీ మూడు బ్యాచ్​లు పూర్తి చేసుకొని నాలుగు బ్యాచ్​ ప్రారంభానికి రెడీ అవుతోంది. హాస్టల్​ బిల్డింగ్స్​ లేక 10కిలోమీటర్ల దూరంలోని ప్రైవేట్​ హాస్టల్​ నుంచి స్టూడెంట్స్​ రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 

రూ. 540 కోట్లతో పనులు..

మెడికల్, నర్సింగ్​ కాలేజీలతో పాటు హాస్టల్​ బిల్డింగ్స్, స్టాఫ్​ క్వార్టర్స్, హాస్పిటల్​ బిల్డింగ్​ కోసం రూ.540కోట్లను సాంక్షన్​ చేస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగానే నర్సింగ్​ కాలేజీ బిల్డింగ్​ కోసం రూ. 42కోట్లు, మెడికల్​ కాలేజీ బిల్డింగ్, హాస్టల్ ​ కోసం రూ. 130కోట్లను సాంక్షన్​ చేస్తూ జీవో ఇచ్చింది. నర్సింగ్​ కాలేజీ బిల్డింగ్ ​పనులను కాంట్రాక్టర్​ పూర్తి చేశారు. కానీ మెడికల్ ​కాలేజీ బిల్డింగ్​పనులు కాలేదు. 

ఇదే టైంలో మెడికల్​ కాలేజీకి సంబంధించి ఇన్స్​పెక్షన్​ కోసం కేంద్రం నుంచి బృందం రావడంతో హడావుడిగా నర్సింగ్​ కాలేజీ కోసం నిర్మించిన బిల్డింగ్​ను మెడికల్​ కాలేజీగా మార్చి చూపించారు. అప్పటి నుంచి నర్సింగ్​ కాలేజీలోనే మెడికల్​ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు బ్యాచ్​ల పూర్తి కాగా, ఆగస్టులో నాలుగో బ్యాచ్​ ప్రవేశాలు మొదలు కానున్నాయి. మరో వైపు నర్సింగ్ ​కాలేజీకి బిల్డింగ్ ​లేకపోవడంతో కొత్తగూడెం పట్టణంలో అరకొర సౌకర్యాల మధ్య ప్రయివేట్​బిల్డింగ్​లోనే కొనసాగించే దుస్థితి ఏర్పడింది. 

ఫండ్స్​ లేక డిలే.. 

మెడికల్​ కాలేజీ, బాయ్స్, గర్ల్స్​ హాస్టల్ బిల్డింగ్​పనులు పూర్తి అయితే నర్సింగ్​ కాలేజీకి హాస్టల్​తో పాటు భవిష్యత్​లో హాస్పిటల్​ నిర్మాణం కొనసాగే అవకాశాలున్నాయి. కానీ మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ పనులు నాలుగేండ్లలో 60శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. దాదాపు రూ. 30కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ పనులను పట్టించుకోవడం లేదు. గతంలో 300 మందికి పైగా కార్మికులతో వర్క్​ చేయించగా ప్రస్తుతం 50 మందితోనే పనులు కొనసాగిస్తున్నారు. 2025 డిసెంబర్​ వరకు ఎక్స్​టెన్షన్​ ఇచ్చినప్పటికీ ఫండ్స్​ లేకపోవడంతో పనులు ఇన్​ టైంలో పూర్తి అయ్యే అవకాశాలు కనపించడంలేదు. 

ఇబ్బందుల్లో స్టూడెంట్స్.. 

మెడికల్ కాలేజీలో ఒక్కో బ్యాచ్​లో 150 మంది స్టూడెంట్స్​ జాయిన్​ అవుతారు. ఇప్పటి వరకు మూడు బ్యాచ్​ల స్టూడెంట్స్​ జాయిన్​ అయ్యారు. వచ్చే ఆగస్టులో మరో కొత్త బ్యాచ్​ రానుంది. హాస్టల్​ బిల్డింగ్​ లేకపోవడంతో పాల్వంచలోని 5కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్, లక్ష్మీదేవిపల్లిలో 10 కిలోమీటర్ల దూరంలోని  మరో ప్రయివేట్​ బిల్డింగ్​లో హాస్టల్​ను కొనసాగుతున్నాయి. ఆ హాస్టళ్లలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు స్టూడెంట్స్​ వాపోతున్నారు.  

హాస్పిటల్​ నిర్మాణం జరుగకపోవడంతో పాల్వంచ నుంచి  ప్రాక్టీస్​ కోసం 12కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెంలోని గవర్నమెంట్​ హాస్పిటల్​కు రావాల్సి వస్తోందని స్టూడెంట్స్​ పేర్కొంటున్నారు. రాకపోకలు సాగించే టైంలో ఏదేని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏంటని స్టూడెంట్స్​ ప్రశ్నిస్తున్నారు. స్టాఫ్​ క్వార్టర్స్​ నిర్మాణంలోనూ జాప్యం జరుగుతుండడంతో ప్రొఫెసర్స్, లెక్చరర్స్​ 

రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. 

బిల్డింగ్​ త్వరగా పూర్తి చేయాలి మెడికల్​ కాలేజీ బిల్డింగ్​తో పాటు హాస్టళ్లు, స్టాఫ్​ క్వార్టర్స్​ భవనాలు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం దూర ప్రాంతంలోని హాస్టళ్ల​ నుంచి స్టూడెంట్స్​ రాకపోకలు సాగిస్తుండడంతో కొంత ఆందోళనగా ఉంది.  - రాజ్​ కుమార్, ప్రిన్సిపాల్, మెడికల్​ కాలేజీ

ఫండ్స్ లేకనే ఆలస్యం.. 

ఫండ్స్​ రిలీజ్​  కావడంలో కొంత జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్​ పనులను స్లోగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల దశలవారీగా పెండింగ్​లో ఉన్న బకాయిలను కొంత మేర మాత్రమే చెల్లించింది. త్వరలో బిల్లులు వస్తాయని, పనులు స్పీడ్​గా చేపట్టాలంటూ కాంట్రాక్టర్​ను కోరాం. - వెంకటేశ్వరరావు, ఈఈ, ఆర్​అండ్​బీ, భద్రాద్రికొత్తగూడెం