
- నాలుగేండ్లుగా కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణం
- రూ. 540 కోట్లతో చేపట్టిన పనుల్లో కానరాని పురోగతి!
- మూడేండ్లుగా నర్సింగ్ కాలేజీలోనే మెడికల్ కాలేజీ..
- సొంత భవనం పూర్తి కాక 10 కిలో మీటర్ల దూరంలోని ప్రయివేట్ హాస్టలే దిక్కు
- ఇప్పటికీ మూడు బ్యాచ్లు కంప్లీట్.. ఆగస్టులో కొత్త బ్యాచ్
- ఫండ్స్ రాక పనులు స్లో... పై ఆఫీసర్లు దృషి పెట్టాలని విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నాలుగేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఫండ్స్ సరిగా రిలీజ్ కాక పనులు కావట్లేదు. నర్సింగ్ కాలేజీ కోసం కట్టిన బిల్డింగ్లోనే మెడికల్ కాలేజీ మూడు బ్యాచ్లు పూర్తి చేసుకొని నాలుగు బ్యాచ్ ప్రారంభానికి రెడీ అవుతోంది. హాస్టల్ బిల్డింగ్స్ లేక 10కిలోమీటర్ల దూరంలోని ప్రైవేట్ హాస్టల్ నుంచి స్టూడెంట్స్ రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
రూ. 540 కోట్లతో పనులు..
మెడికల్, నర్సింగ్ కాలేజీలతో పాటు హాస్టల్ బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్, హాస్పిటల్ బిల్డింగ్ కోసం రూ.540కోట్లను సాంక్షన్ చేస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగానే నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ కోసం రూ. 42కోట్లు, మెడికల్ కాలేజీ బిల్డింగ్, హాస్టల్ కోసం రూ. 130కోట్లను సాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చింది. నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ పనులను కాంట్రాక్టర్ పూర్తి చేశారు. కానీ మెడికల్ కాలేజీ బిల్డింగ్పనులు కాలేదు.
ఇదే టైంలో మెడికల్ కాలేజీకి సంబంధించి ఇన్స్పెక్షన్ కోసం కేంద్రం నుంచి బృందం రావడంతో హడావుడిగా నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన బిల్డింగ్ను మెడికల్ కాలేజీగా మార్చి చూపించారు. అప్పటి నుంచి నర్సింగ్ కాలేజీలోనే మెడికల్ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు బ్యాచ్ల పూర్తి కాగా, ఆగస్టులో నాలుగో బ్యాచ్ ప్రవేశాలు మొదలు కానున్నాయి. మరో వైపు నర్సింగ్ కాలేజీకి బిల్డింగ్ లేకపోవడంతో కొత్తగూడెం పట్టణంలో అరకొర సౌకర్యాల మధ్య ప్రయివేట్బిల్డింగ్లోనే కొనసాగించే దుస్థితి ఏర్పడింది.
ఫండ్స్ లేక డిలే..
మెడికల్ కాలేజీ, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్పనులు పూర్తి అయితే నర్సింగ్ కాలేజీకి హాస్టల్తో పాటు భవిష్యత్లో హాస్పిటల్ నిర్మాణం కొనసాగే అవకాశాలున్నాయి. కానీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు నాలుగేండ్లలో 60శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. దాదాపు రూ. 30కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ పనులను పట్టించుకోవడం లేదు. గతంలో 300 మందికి పైగా కార్మికులతో వర్క్ చేయించగా ప్రస్తుతం 50 మందితోనే పనులు కొనసాగిస్తున్నారు. 2025 డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పటికీ ఫండ్స్ లేకపోవడంతో పనులు ఇన్ టైంలో పూర్తి అయ్యే అవకాశాలు కనపించడంలేదు.
ఇబ్బందుల్లో స్టూడెంట్స్..
మెడికల్ కాలేజీలో ఒక్కో బ్యాచ్లో 150 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఇప్పటి వరకు మూడు బ్యాచ్ల స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వచ్చే ఆగస్టులో మరో కొత్త బ్యాచ్ రానుంది. హాస్టల్ బిల్డింగ్ లేకపోవడంతో పాల్వంచలోని 5కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్, లక్ష్మీదేవిపల్లిలో 10 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రయివేట్ బిల్డింగ్లో హాస్టల్ను కొనసాగుతున్నాయి. ఆ హాస్టళ్లలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు స్టూడెంట్స్ వాపోతున్నారు.
హాస్పిటల్ నిర్మాణం జరుగకపోవడంతో పాల్వంచ నుంచి ప్రాక్టీస్ కోసం 12కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు రావాల్సి వస్తోందని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు. రాకపోకలు సాగించే టైంలో ఏదేని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏంటని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణంలోనూ జాప్యం జరుగుతుండడంతో ప్రొఫెసర్స్, లెక్చరర్స్
రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలి మెడికల్ కాలేజీ బిల్డింగ్తో పాటు హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్ భవనాలు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం దూర ప్రాంతంలోని హాస్టళ్ల నుంచి స్టూడెంట్స్ రాకపోకలు సాగిస్తుండడంతో కొంత ఆందోళనగా ఉంది. - రాజ్ కుమార్, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజీ
ఫండ్స్ లేకనే ఆలస్యం..
ఫండ్స్ రిలీజ్ కావడంలో కొంత జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్ పనులను స్లోగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల దశలవారీగా పెండింగ్లో ఉన్న బకాయిలను కొంత మేర మాత్రమే చెల్లించింది. త్వరలో బిల్లులు వస్తాయని, పనులు స్పీడ్గా చేపట్టాలంటూ కాంట్రాక్టర్ను కోరాం. - వెంకటేశ్వరరావు, ఈఈ, ఆర్అండ్బీ, భద్రాద్రికొత్తగూడెం