ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయిలాండ్ లో అత్యవసర ల్యాండింగ్..

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయిలాండ్ లో అత్యవసర ల్యాండింగ్..

గురువారం ( జూన్ 12 ) అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటన గురించి తెలిసిందే.. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.శుక్రవారం ( జూన్ 13) ఉదయం సమయానికి ఈ ఘటనలో మృతిచెందినవారి సంఖ్య 297కు పెరిగింది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో థాయిలాండ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. 

బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అండమాన్ సముద్రంపై చక్కర్లు కొట్టింది విమానం. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. విమానంలో 156 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.

కాగా.. శుక్రవారం ( జూన్ 13 ) అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనాస్థలాన్ని సందర్శించారు ప్రధాని మోడీ. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ విధ్వంసం అత్యంత బాధాకరమని అభివర్ణించారు మోడీ. ఘటనాస్థలంలో  పనిచేస్తున్న అధికారులు, రెస్క్యూ బృందాలను ఆయన కలిశారు.ఈ ఊహించలేని విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.