సీబీఐ వేధిస్తున్నది .. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణ

సీబీఐ వేధిస్తున్నది .. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణ
  • హైకోర్టులో బెయిల్​ పిటిషన్ 

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నదని అందులో ఆరోపించారు. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో 2023 ఏప్రిల్ లో నన్ను విచారణకు పిలిచినప్పుడు సీబీఐకి పూర్తిగా సహకరించాను. కానీ ఈ కేసు దర్యాప్తు పేరుతో సీబీఐ నన్ను నిరంతరం వేధిస్తున్నది. ఇది చాలా తీవ్రమైన అంశం. నా అరెస్టు పూర్తిగా అక్రమం, రాజ్యాంగ విరుద్ధం. ఏ కేసులోనైనా రిమాండ్ ఉత్తర్వులు సాధారణం. కానీ ఇవి న్యాయ ప్రక్రియను దెబ్బతీసేందుకు దారితీస్తాయి.

ఇప్పటికే కేసు విచారణ, ఆధారాల సేకరణ పూర్తయింది. అయినా సీబీఐ ఇలా వ్యవహరించడం సరికాదు” అని పేర్కొన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను మొదట ఈడీ అరెస్టు చేసింది. ఆ కేసులో జైల్లో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ట్రయల్ కోర్టులో హాజరుపరచగా.. మూడ్రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించడంతో పాటు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన అరెస్టుతో పాటు ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కూడా సవాల్ చేస్తూ  కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్​లో ఉంది.