- అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిపై స్పందించని కోర్టు
- ఈమెయిల్ పంపితే పరిశీలిస్తామన్న సీజేఐ
- ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ
- లాయర్లను ఎక్కువసార్లు కలిసేందుకు నో చెప్పిన కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బుధవారం ఉదయం ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ క్లయింట్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరగా, కోర్టు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గురువారం విచారణకు అనుమతిస్తారా లేదా? చెప్పేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే, తనకు ఈ మెయిల్ ద్వారా అభ్యర్థన పంపిస్తే పరిశీలిస్తానని అభిషేక్ సింఘ్వీకి సీజేఐ డీవై చంద్రచూడ్ సూచించారు.
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్..
ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని తేల్చిచెప్పింది. కోర్టులు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి కానీ.. రాజకీయ నైతికతకు కాదని తెలిపింది. మనీలాండరింగ్పై ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును అర్వింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
మరో పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీఎంగా విధులకు సంబంధించి చర్చించేందుకు వారానికి ఐదుసార్లు లాయర్లను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ మరో పిటిషన్ వేశారు. దీనికి ఈడీ అభ్యంతరం తెలిపింది. ఇది జైలు మ్యానువల్కు వ్యతిరేకమని వాదించింది. ఆయనకు ఇప్పటికే లాయర్లను కలిసేందుకు రెండుసార్లు అవకాశమిస్తున్నట్టు కోర్టుకు వెల్లడించింది. కేజ్రీవాల్ జైలునుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ప్రత్యేక అధికారాలు కల్పించొద్దని కోర్టును కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. కేజ్రీవాల్కు ఈ విషయంలో రిలీఫ్ ఇవ్వడానికి తగిన కారణాలు లేవంటూ పిటిషన్ను కొట్టేశారు.
కేజ్రీవాల్కు జైలు మాన్యువల్
అర్వింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి మేరకు ఆయనకు జైలు మాన్యువల్ అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. జైలులో ఉన్న వారు లైబ్రరీలో ఉన్న ఏ పుస్తకాన్నైనా చదవొచ్చని తెలిపారు. ఆయన సెల్లో తరుచూ పుస్తకాలు చదువుతూ.. కుర్చీలో కూర్చొని రాసుకుంటూ కనిపిస్తున్నారని తెలిపారు. ఆయన జైలు
మాన్యువల్ ను కూడా చదివారని పేర్కొన్నారు.
తీహార్ జైలునుంచి కేజ్రీవాల్ మరో సందేశం
తీహార్ జైలునుంచి ఆప్ నేతలకు అర్వింద్ కేజ్రీవాల్ మరో సందేశాన్ని ఇచ్చారు. ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హఠావో దివస్’(రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. నియంతృత్వాన్ని నిర్మూలించండి)ను నిర్వహించాలని కేజ్రీవాల్ఆదేశించినట్టు ఆప్ నేతలు తెలిపారు. అలాగే, ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆప్ ఎమ్మెల్యేలు, వలంటీర్లు పనిచేయాలని కేజ్రీవాల్ ఆదేశించినట్టు ఆ పార్టీ నేత గోపాల్ రాయ్మీడియాకు వెల్లడించారు. దేశంలో నియంతృత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎంత హింసనైనా భరించేందుకు ఆప్ సిద్ధంగా ఉన్నదని కేజ్రీవాల్ తెలిపారన్నారు. కాగా, కేజ్రీవాల్అరెస్ట్ను నిరసిస్తూ అమెరికా, కెనడా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలోని ఆప్ వలంటీర్లు ఆయా దేశాల్లోని ఇండియా ఎంబసీల వద్ద ఆందోళన చేపట్టారు.