కరోనా సోకిన రోగులకు సేవ చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం అంతటా లాక్ డౌన్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. డాక్టర్లు, నర్సులు, పారిశుద్య కార్మికులు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. ఆ సమయంలో వారు ప్రాణాలు కొల్పోతే వారివారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రాణాలు కొల్పోయింది ప్రైవేట్ రంగం వాళ్లా లేకపోతే ప్రభుత్వ రంగం వాళ్ల అనేది చూడకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన అన్నారు.
‘మీ సేవలు అమూల్యమైనవని నాకు తెలుసు. మీరు మానవతా దృక్పథంతో ఆ పనులు చేస్తున్నారు. అందుకే మేం గౌరవ చిహ్నంగా మీకోసం ఈ మాత్రం చేస్తున్నాము. దేశ ప్రజల తరపున మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స చేస్తున్నారని’ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బందితో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేజ్రీవాల్ అన్నారు. కరోనా సోకిన రోగులకు సేవ చేస్తున్న వైద్యులు మరియు నర్సులు ప్రతిరోజూ వారివారి ఇంటికి వెళ్ళలేరు కాబట్టి వారికోసం ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఉండటానికి కావాలసిన ఏర్పాట్లు చేశామని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ఇప్పటికే కరోనా నివారణ కోసం పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది.
For More News..