హాస్టల్కు దగ్గర్లో బాంబు పేలింది.. మూడు రోజులుగా నిద్రలేదు.. ఇరాన్లో ఇండియన్ స్టూడెంట్స్ బాధ వర్ణనాతీతం

హాస్టల్కు దగ్గర్లో బాంబు పేలింది.. మూడు రోజులుగా నిద్రలేదు.. ఇరాన్లో ఇండియన్ స్టూడెంట్స్ బాధ వర్ణనాతీతం

వందల సంఖ్యలో బాంబులు.. అంతకు మించిన సంఖ్యలో మిస్సైళ్లు.. నిత్యం అగ్నిగుండంలా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు. గత మూడు రోజులుగా ఇరు దేశాలు మొదలుపెట్టిన యుద్ధం తారా స్థాయికి చేరుకుంది.  ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తుందా అన్నట్లుగా.. భగభగ మండుతూ బాంబులూ, మిస్సైళ్లు పడుతుండటంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. జనాలు ఇళ్లనుంచి బయటకి రాకుండా తలదాచుకుంటున్నా.. నివాస సముదాయాలపై కూడా బాంబులు పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొంది.

ఇరాన్ లో ఉన్న భారత విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యుద్ధం ఇంతకింతకూ పెరుగుతుండటంతో.. స్వదేశానికి వెళ్దామన్నా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. వైద్య విద్య కోసం ఇరాన్ వెళ్లిన విద్యార్థులు మెడికల్ యూనివర్సిటీలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

‘‘మా హాస్టల్ కు 5 కిలోమీటర్ల దూరంలో బాంబు పేలింది. మొత్తం 350 మంది విద్యార్థులం ఇక్కడ ఉన్నాం. బాంబు పేలడంతో భయాందోళనకు గురయ్యాం’’ అంటూ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మొహిదీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. టెహ్రాన్ లోని షహీద్ బహెస్తీ యూనివర్సిటీలో ఉన్న తమను ఎలాగైనా ఇండియాకు చేర్చాలని వేడుకుంటున్నారు. 

‘‘శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హాస్టల్ కు సమీపంలో బాంబులు పేలాయి. హాస్టల్ లో ప్రకంపనలు వచ్చినట్లు అనిపించింది. అప్పట్నుంచి మాకు నిద్ర లేదు’’ అని కన్నీరుపెట్టుకున్నారు. నగరం మొత్తం బాంబుల మోతలతో మారుమోగుతోంది. కనీసం నీళ్లు తెచ్చుకునేందుకు కూడా బయటికి వెళ్లలేక పోతున్నామని అంటున్నారు. 

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇండియన్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఇరాన్ చుట్టు పక్కల రిస్ట్రిక్షన్స్ కారణంగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఇరాన్ లో ఉన్న విద్యార్థులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇండియా వద్దామనుకున్నా రాలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణాలను గంటల మాదిరిగా లెక్కపెడతున్నారు.

ఇరాన్ విద్యార్థుల పరిస్థితులపై ఇండియన్ ఎంబసీ స్పందించింది. భారత విద్యార్థులు బయటకు రావద్దని సూచించింది. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తామని.. అత్యవసర పరిస్థితులు ఉంటే సంప్రదించాలని సూచించింది. 

రోడ్డు మార్గం ద్వారా విద్యార్థులను తరలించండి: ఇరాన్

ఇజ్రాయెల్ దాడుల కారణంగా వాయు మార్గం మొత్తాన్ని మూసేయడంతో.. రోడ్డు మార్గాన్ని వాడుకోవచ్చునని ఇరాన్ భారత్ కు తెలిపింది. ఇరాన్ బోర్డర్ ను తెరిచామని, ఇండియన్ స్టూడెంట్స్ ను అక్కడి నుంచి తరలించవచ్చునని సూచించింది. ఇరాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులను తరలించేందుకు బోర్డర్ ఓపెన్ చేయాలని ఇండియా కోరడంతో.. సరిహద్దు ప్రాంతాన్ని ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. దీంతో ఈ మార్గం ద్వారా విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.