
నిర్భయ కేసులో దోషుల ఉరికి డేట్ ఖరారు చేస్తూ పాటియాలా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 22న వారి ఉరి వేయాలని కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. దేశ వ్యాప్తంగా అత్యాచారాలను ఎదుర్కొని జీవితాన్ని సాగిస్తున్న ‘నిర్భయ’లందరి విజయంగా దీన్ని ఆమె అభివర్ణించారు. ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నానని స్వాతి అన్నారు. నేరం చేసిన వాళ్లను శిక్షించడానికి ఏడేళ్ల టైమ్ పట్టడానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. ఈ ఆలస్యాన్ని తగ్గించలేమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చివరి రెండు వారాలు..
2012 డిసెంబరులో నిర్భయ అత్యాచారం, హత్యకు పాల్పడిన దుర్మార్గులకు ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఉరి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైలులో ఉరి తీసేందుకు పాటియాలా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్భయ దోషులు నలుగురు ముఖేశ్, అక్షయ్, పవన్, వినయ్లను త్వరగా ఉరితీయాలని, వారికి డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి సతీశ్ అరోరా.. తీర్పు ఇచ్చారు. ఈ రెండు వారాల టైంలో న్యాయ పరంగా వారికి ఉన్న అన్ని హక్కులను వినియోగించుకోవాలని ఆదేశించింది.