న్యూఢిల్లీ : రెజ్లింగ్ కోచ్ నరేష్ దహి యా వేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 6న కోర్టు ముందు హాజరుకావాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యష్దీప్ చహల్ ఆదేశించారు. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత దహియా పరువుకు భంగం కలిగేలా బజ్రంగ్ వ్యవహరించినట్లు తేలిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
‘ఫిర్యాదు, సపోర్టింగ్ డాక్యుమెంట్లు, ముందస్తు సమన్ల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే పరువుకు నష్టం కలిగించే అంశాలు బయటపడ్డాయని ప్రాథమికంగా భావిస్తున్నాం. మీడియా సమావేశంలో చేసిన ప్రకటన దురుద్దేశంతో చేసినట్లుగా ఉంది. దాని దృష్ట్యా ఐపీసీ సెక్షన్ 499, 500 (క్రిమినల్ పరువు నష్టం) ప్రకారం ఇది శిక్షార్హమైన నేరంగా భావిస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.