
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్) వాయిదా వేసింది. ఆగస్టు 7 న తుది వాదనలు వింటానన్న ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మరో రోజు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో కోర్టు ఆగస్టు 7 కు వాయిదా వేసింది.
లిక్కర్ స్కాం కేసులో కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఆగస్టు 6న జైల్లో కవితతో ములాఖత్ కానున్నారు. జైల్లో కవితను కలిసి ధైర్యం చెప్పనున్నారు నేతలు.
లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత
గత కొంతకాలంగా కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 22న హుటాహుటిన ఢిల్లీ వచ్చిన కేటీఆర్.. కవితతో ములాఖత్ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆమెతో ముచ్చటించి, అరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, తదితర వివరాలపై ఆరా తీశారు.