హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ

హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి. ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను మార్చి 10వ తేదీ  విచారించిన తర్వాత.. ఆయన రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలను వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని.. ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే చర్చలు జరిగాయని రిపోర్టులో స్పష్టం చేసింది ఈడీ. దినేష్ అరోరాను హైదరాబాద్ పిలిపించిన సౌత్ గ్రూప్ సభ్యులు.. హోటల్ కేంద్రంగా డిస్కషన్ చేసినట్లు చెబుతోంది ఈడీ.

చర్చల సమయంలో విజయ్ నాయర్, అర్జున్ పాండే, అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు అందరూ కలిసే ఉన్నారని..ఎనిమిది గంటలపాటు వీరి మీటింగ్ జరిగిందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ రాసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కాంలో.. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టచెప్పినట్లు ఈడీ తేల్చింది. ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ పిళ్లయ్ ప్రాతినిధ్యం వహించారని..ఇండో స్పిరిట్ కంపెనీలో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ దే అని రిపోర్టు ద్వారా కోర్టుకు సమర్పించారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని ఆమె పేరును ప్రస్తావించారు అధికారులు.

సౌత్ గ్రూప్ సిండికేట్ లో మాగుంట రాఘవరెడ్డి, విజయ్ నాయర్, బుచ్చిబాబుతోపాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని మొదటిసారి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చే లాభాల్లో ఆరు శాతం సౌత్ గ్రూప్ కు.. ఆరు శాతం ఆప్ పార్టీకి పంచుకుంటూ.. ఈ డీల్ జరిగిందని సిసోడియా విచారణ తర్వాత వెల్లడించింది ఈడీ.