
- మృతుల్లో తండ్రి, కొడుకు, బిడ్డ
- ప్రాణాలతో బయటపడ్డ భార్య, మేనకోడలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్లో మంటలు అంటుకోవడంతో 8వ అంతస్తు నుంచి కిందికి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కాలిన గాయాలతో బయటపడ్డారు. ఢిల్లీ ద్వారకా సెక్టార్–13లోని శపథ్ సొసైటీలో యశ్ యాదవ్ (35) కుటుంబం ఉంటున్నది. ఇక్కడి 9 అంతస్తుల బిల్డింగులో 8, 9 ఫ్లోర్లలోని డుప్లెక్స్ హౌస్లో నివసిస్తున్నది. అయితే వీళ్ల ఇంట్లో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి ఒక్కసారిగా ఇల్లంతా వ్యాపించి పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది.
దీంతో భయాందోళనకు గురైన యశ్ యాదవ్ కొడుకు (10), బిడ్డ (10) ఇద్దరూ 8వ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకారు. ఆ తర్వాత యశ్ యాదవ్ కూడా అదే బాల్కనీ నుంచి కిందికి దూకాడు. వాళ్ల ముగ్గురికీ తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ముగ్గురూ చనిపోయారు.
యశ్ యాదవ్ భార్య, అతని మేనకోడలు కాలిన గాయాలతో బతికి బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్లిద్దరికీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా, ఉదయం 10 గంటలకు తమకు ఫోన్ వచ్చిందని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఆ వెంటనే 8 ఫైర్ ఇంజిన్లను స్పాట్కు పంపించామని చెప్పారు. స్కై లిఫ్ట్ ద్వారా
అపార్ట్మెంట్లోని వాళ్లను కాపాడామన్నారు.