దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తన ఫ్రెండ్ కూతురైన మైనర్ బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసి గర్భావతిని చేశాడు. ఈ దారుణాన్ని ప్రశ్నించాల్సిన భార్యే.. భర్తకు సహకరించడం గమనార్హం. రాజధానిలో సంచలనం రేపుతోన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని సహకరించిన అతడి భార్యను అరెస్ట్ చేశారు.
నిందితుడు ప్రేమోదయ్ ఖాఖా ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. 2020 అక్టోబర్1న అతడి స్నేహితుడు మరణించడంతో అతడి కుమార్తె బాధ్యతను తాను చూసుకుంటానని ఆమెను తన ఇంటికే తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆ అధికారి భార్య గర్భనిరోదక టాబ్లెట్స్ వేసి అబార్షన్ జరిగేలా చేసింది.
అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో ఆందోళనకు గురైనా ఆమె తల్లి ఆస్పత్రిలో జాయిన్ చేసింది. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆ బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి డాక్టర్లకు చెప్పింది. డాక్టర్లు పోలీసులకు చెప్పడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి సహకరించిన ఆ అధికారి భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కేజ్రీవాల్ సర్కార్ అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.