
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమి కారణంగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని ఆసీస్ వ్యూహాలు రచిస్తుంది. నాగ్ పూర్ టెస్ట్ లాగానే ఢిల్లీ టెస్టులో కూడా కంగారులను దెబ్బకొట్టాలని టీమిండియా చూస్తుంది.
టీమిండియాదే పై చేయి
అరుణ్ జైట్లీ మైదానంలో టీమిండియాకు మంచి రికార్డుంది. గత 36 ఏళ్లుగా ఇక్కడ మరో విదేశీ టీం గెలవలేదు. ఢిల్లీ వేదికపై జరిగిన 34 టెస్టు మ్యాచుల్లో టీమిండియా 13 మ్యాచుల్లో గెలిచి 6 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక్కడ ఏడు మ్యాచులాడిన ఆసీస్ కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. ఆ మ్యాచ్ కూడా 1959లో జరిగింది. ఇదే వేదికపై 1999లో టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీశాడు.
పిచ్.. స్పిన్ కి అనుకూలం
ఢిల్లీ స్టేడియం పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మరొకసారి అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ల మాయాజాలాన్ని చూడొచ్చు. అయితే, పిచ్ పై కొంత పచ్చిక ఉన్న కారణంగా కొంతమేరకు బ్యాటింగ్ కి అనుకూలించొచ్చు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఫిట్ నెస్ సాధించడంతో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్ కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. టీమిండియా మాత్రం ఏ మార్పు చేయకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
విరాట్ హోం గ్రౌండ్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంత మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. దీంతో విరాట్ బ్యాట్ నుంచి సూపర్ ఇన్నింగ్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఫామ్ లోకి వచ్చి వన్డే, టీ20ల్లో సూపర్ సెంచరీలు బాదిన కోహ్లీ సొంత వేదికపై రాణిస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.