- చాలా వేగంగా అంటుతోందన్న డబ్ల్యూహెచ్వో
- ఐసీయూ కేసులు ఎక్కువైతయ్
- ఆక్సిజన్ కూడా ఎక్కువ కావాలె
- ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు బాగా పనిచేస్తున్నయ్
- దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్తో తొలి మరణం
న్యూఢిల్లీ: ‘డెల్టా’ కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 85 దేశాల్లో డెల్టా రకం కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపం చ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే దాని ముప్పు మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 170 దేశాల్లో ఆల్ఫా వేరియంట్ కేసులున్నాయని చెప్పింది. వాటిలోనే బీటా 119 దేశాల్లో, గామా వేరియంట్ కేసులు71 దేశాల్లో నమోదైనట్టు తెలిపింది. ఈ వేరియంట్ల వ్యాప్తిని పరిశీలిస్తున్నామని చెప్పింది. వీక్లీ కరోనా రిపోర్ట్లో డబ్ల్యూహెచ్వో ఈ విషయాలను వెల్లడించింది.
ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా డేంజర్ అని, చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలో ఇండియాలోనే ఎక్కువగా 4,41,976 కేసులు వచ్చాయని, 16,329 మరణాలు నమోదయ్యాయని చెప్పిం ది. అయితే, అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 30%, మరణాలు 31% తగ్గాయంది.
ఆక్సిజన్ బాగా కావాలె
డెల్టా వేరియంట్ కేసులు పెరిగితే ఆక్సిజన్ అవసరం బాగా పెరుగుతుందని, ఐసీయూ చికిత్సలూ పెరుగుతాయని హెచ్చరించిన సింగపూర్ స్టడీని డబ్ల్యూహెచ్వో గుర్తు చేసింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ ఆర్ (రిప్రొడక్షన్– వ్యాప్తి) వాల్యూ ఎక్కువగా ఉందని చెప్పింది. డెల్టా వేరియంట్పై ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు బాగా పనిచేస్తున్నట్టు స్టడీల్లో తేలిందని పేర్కొంది. రెండు డోసులు వేసుకున్న 14 రోజుల తర్వాత ఫైజర్ వ్యాక్సిన్తో డెల్టా నుంచి 96 శాతం, ఆల్ఫా నుంచి 95 శాతం రక్షణ వస్తోందని చెప్పింది. అదే ఆస్ట్రాజెనికాతో టీకాతో 94 శాతం, 83 శాతంగా ఉందని పేర్కొంది. ఒక్క డోసు వేసుకున్న తర్వాత కూడా ఫైజర్ వ్యాక్సిన్తో డెల్టా నుంచి 94శాతం, ఆల్ఫా నుంచి 83 శాతం రక్షణ ఉంటోందని పేర్కొంది. ఆస్ట్రాజెనికా టీకాతో కూడా దాదాపు అదే స్థాయిలో కరోనా వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తోందని తెలిపింది.
యూరప్కు డెల్టా ముప్పు: ఏంజెలా మెర్కెల్
యూరప్ దేశాలకు డెల్టా వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉందని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. పార్లమెంట్లో ఆమె చివరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూరప్ దేశాల్లో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుని కరోనా కేసులు తగ్గాయని, అయినా కూడా అక్కడితోనే ఆగిపోవద్దని ఆమె హెచ్చరించారు. ఆగస్టు చివరి నాటికి యూరప్ దేశాల్లో నమోదయ్యే కొత్త కేసుల్లో డెల్టా వేరియంట్ కేసులే 90 శాతం దాకా ఉంటాయని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో 15 శాతం ఉంటున్నాయన్నారు.
దేశంలో తొలి డెల్టా ప్లస్ డెత్
భోపాల్: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్తో తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన 59 ఏండ్ల మహిళ ఆ డెల్టా ప్లస్ కరోనాతో మరణించింది. ఆ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి, ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మే 23న ఆమె కరోనాతో మరణించిందని, శాంపిళ్లను టెస్ట్ చేయగా డెల్టా ప్లస్ వేరియంట్గా తేలిందని కలెక్టర్ చెప్పారు. భోపాల్లో 3, ఉజ్జయినిలో 2 డెల్టా ప్లస్ కేసులు వచ్చాయన్నారు. ప్రస్తుతం దేశంలో 40కిపైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నాయి. ప్రపంచంలోని 11 దేశాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. 197 మంది దాని బారిన పడ్డారు.