ముంబై: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది క్యూ1 (జనవరి–మార్చి) మధ్యలో ఈ డిమాండ్ 37 శాతం పెరిగి 140 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. కోవిడ్ రూల్స్ సడలింపు, పెంటప్ డిమాండ్ (ఒక్కసారిగా వచ్చే డిమాండ్), రేట్లు తక్కువగా ఉండటం వల్లే బంగారానికి డిమాండ్ వస్తోందని పేర్కొంది. డబ్ల్యూజీసీ డేటా ప్రకారం 2020 క్యూ1లో గోల్డ్ డిమాండ్ 102 టన్నులు. వాల్యూ ప్రకారం చూసినా బంగారానికి డిమాండ్ 57 శాతం పెరిగి రూ. 58,800 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో ఇది రూ. 37,580 కోట్లే. జనవరి–మార్చి 2021 మధ్యలో జ్యువెలరీ డిమాండ్ 39 శాతం పెరిగి 102 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చెబుతోంది. వాల్యూ పరంగా చూస్తే జ్యువెలరీ డిమాండ్ 58 శాతం పెరిగి రూ. 43,100 కోట్లకు చేరుకుంది. కిందటేడాది ఇదే క్వార్టర్లో ఈ వాల్యూ రూ. 27,230 కోట్లు గా ఉంది. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతున్నాయి. మార్చి క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 37.5 టన్నులకు చేరుకుంది. కిందటేడాది మార్చి క్వార్టర్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 28 టన్నులుగా ఉంది. వాల్యూ పరంగా చూస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల వాల్యూ కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ. 10,350 కోట్లుగా ఉండగా, ఈ మార్చి క్వార్టర్లో రూ. 15,780 కోట్లుగా ఉంది. నికర బులియన్ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 83.1 టన్నుల నుంచి 301 టన్నులకు పెరిగాయి.