హైదరాబాద్ , వెలుగు: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ పేరుతో కేంద్రం విడుదల చేసిన రూ.100 కాయిన్కు ఫుల్ గిరాకీ నెలకొంది. మంగళవారం ఉదయం నుంచే సెక్రటేరియెట్ వెనుక ఉన్న మింట్ కంపౌండ్లోని మింట్, చర్లపల్లి మింట్లో ఎన్టీఆర్ కాయిన్ను దక్కించుకునేందుకు పబ్లిక్, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు బారులు తీరారు. 35 గ్రాములు ఉన్న సిల్వర్ కాయిన్ను మింట్ అధికారులు రు.4,850కు అమ్మారు.
ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలిపే బుక్ లెట్, కాయిన్లు ఉన్నాయి. మొదటి విడతలో 12 వేల నాణేల తయారు చేయగా అన్నీ అమ్ముడయినట్లు తెలుస్తోంది. కొంతమంది రెండు మూడు కొన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కాయిన్ను గుర్తుగా దాచుకుంటామని కొనుగోలుదారులు తెలిపారు. 4 గంటలు క్యూలో ఉండి 6 కాయిన్లను కొన్నానని ఓ వ్యక్తి తెలిపాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, అంతకుముందు తెలుగువారిని మద్రాసీలు అనేవారని వైజాగ్ కు చెందిన ఓ అభిమాని తెలిపారు.