
భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ లేదా AI జనరేటెడ్ తో చేసిన జంతువులను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు సినీ చరిత్రలో తొలిసారిగా ఏకంగా ఒక నిజమైన సింహంతో పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ను రూపొందిస్తున్నారు. ఈ సాహసోపేతమైన చిత్రానికి ‘సింఘా' (Singha) అనే పేరు పెట్టారు. ఈ సినిమాను ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత వి. మతియళగన్, తిత్తిర్ ఫిల్మ్ హౌస్ ప్రై. లి. సహకారంతో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది కె.సి. రవిదేవన్. ఇతను 'ఉలగనాయగన్' కమల్ హాసన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న హీరోయిన్ శ్రుతి రావు అసాధారణ ధైర్యాన్ని చూపించారు. నిజమైన సింహంతో కలిసి నటించాలంటే చాలా మంది అగ్ర కథానాయికలు వెనుకాడగా, శ్రుతి రావు మాత్రం ఈ ఛాలెంజ్ను స్వీకరించి అద్భుతంగా నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.
అంతేకాదు, సినిమాలో ఒక విలన్ పాత్ర ఏకంగా 300 తోడేళ్లతో నటించాల్సి ఉంటుంది. ఈ శక్తివంతమై పాత్ర కోసం ఎంతో మందిని పరిశీలించారు. చివరకు '1945', 'పోతునలన్ కౌర్తి', 'జవాన్' వంటి చిత్రాల్లో నటించిన లీషా ఎక్లెయిర్ ఎంపిక చేశారు. ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయి చాలా పవర్ ఫుల్గా నటిస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది.
ALSO READ : ‘ఘాటి’ సెన్సార్ రివ్యూ..
‘సింఘా’ కేవలం ఒక ప్రాంతీయ చిత్రంగా కాకుండా.. ఒక పాన్-ఇండియా సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ కోసం మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జాంబియా, గోవా వంటి అంతర్జాతీయ లొకేషన్లతో పాటు విశాఖపట్నం, తెన్కాసి వంటి ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిగింది. సినిమా కథ గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు..
నిర్మాత వి. మతియళగన్ గతంలో 'మహా', 'కొళైయుథిర్ కాలం' వంటి విలక్షణమైన చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ సినిమాతో భారతదేశ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఒక విజువల్ వండర్గా ఉంటుంది. ముఖ్యంగా నిజమైన జంతువులతో చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.