ముషీరాబాద్, వెలుగు: ఫీజుల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజీ స్టూడెంట్స్కు స్కాలర్ షిప్ను రూ.5,500 నుంచి రూ.20వేలకు పెంచాలని డిమాండ్చేస్తూ 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తున్నట్టు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ జిల్లపల్లి అంజి, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. నవంబర్ 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్లాసులు బహిష్కరించి 18 డిమాండ్లతో కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడించాలన్నారు. రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న రూ.3,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వృత్తి విద్య కోర్సులు చేసే ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు పూర్తి ఫీజు బకాయిలు చెల్లించాలన్నారు. బీసీ స్టూడెంట్స్కు చదువు దూరం చేసేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్టూడెంట్స్ అందరికీ ఒకేరకమైన ఫీజు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇవ్వాలని, బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నీల వెంకటేశ్, భాస్కర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
