డెంగీ ఎఫెక్ట్… పొప్పడి కిలో రూ.100

డెంగీ ఎఫెక్ట్… పొప్పడి కిలో రూ.100

రంగారెడ్డి జిల్లా, వెలుగు: పొప్పడి పండ్లకు మార్కెట్​లో మస్తు గిరాకీ పలుకుతోంది. మొన్నటిదాకా కొనేవాళ్లే దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు కిలో పొప్పడి పండు రూ. 100 దాకా పలుకుతోంది. వైరల్​ ఫీవర్స్​ను తగ్గించే గుణం ఈ పండ్లకు ఉంటుందని జనం నమ్మడమే ఇందుకు  కారణమని వ్యాపారులు అంటున్నారు. వాతావరణ మార్పులతోపాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీజనల్‌‌‌‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. టైఫాయిడ్‌‌‌‌, డెంగీ వంటి వైరల్​ ఫీవర్స్​ కారణంగా దేహంలో రక్త కణాల సంఖ్య పడిపోతుంది. రక్త కణాల పెంపునకు పొప్పడిపండ్లు  ఉపయోగపడుతాయని జనం భావిస్తున్నారు. వైరల్​ ఫీవర్స్​ నుంచి ముందస్తుగా రక్షణ కోసం పొప్పడిపండ్ల రసం తాగడం, పండ్లు తినడం అలవాటు చేసుకుంటున్నారు.

ఇట్ల రాగానే.. అట్ల..

సాధారణంగా పొప్పడి పండ్లు జులై, ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌లోనే ఎక్కువగా మార్కెట్​లోకి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్​లో పొప్పడి పండ్లకు ఉన్నంత గిరాకీ మరే పండ్లకు లేదని వ్యాపారులు అంటున్నారు. గతేడాది ఇదే సమయంలో ఈ పండ్లు కిలో రూ.20 ఉంటే.. ఇప్పుడు కిలో రూ. 50 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయని చెబుతున్నారు. సాధారణంగా పొప్పడి పండ్లు తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్లలో పొప్పడి పండ్ల క్రయ, విక్రయాలు జరగకపోతే పారబోసిన సందర్భాలు కూడా ఉన్నాయని వ్యాపారులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అదే పండు బంగారంలాగా మారిందని, దాన్ని కొనేందుకు జనం ఎగబడుతున్నారని చెబుతున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, నల్గొండ, ఖమ్మం, మల్కపూర్‌‌‌‌, అనంతపురం, ప్రకాశం, విజయవాడతోపాటు గుల్బర్గా ప్రాంతాల నుంచి హైదరాబాద్​లోని గడ్డి అన్నారం మార్కెట్​కు ఈ పండ్లు దిగుమతి అవుతుంటాయి. ఆయా ప్రాంతాల నుంచి రైతులు తెచ్చిన పండ్లను మార్కెట్​లోని కమీషన్‌‌‌‌ ఏజెంట్లు కొనుగోలు చేసి.. రిటైల్‌‌‌‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. రిటైర్​ వ్యాపారులు వాటిని తీసుకెళ్లి వ్యాపారం చేసుకుంటున్నారు. గతేడాది ఇదే టైమ్​లో రోజుకు 10 నుంచి 20 టన్నుల పొప్పెడిపండ్లు మాత్రమే గడ్డి అన్నారం మార్కెట్​కు వచ్చేవి.

పొప్పడి రైతులపై దాడి 

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో పొప్పడిపండ్ల రైతులపై దళారులు దాడికి దిగారు. తమ పండ్లను ఎత్తుకుపోతున్న ఓ దళారిని రైతులు వారిస్తుండగా ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా గుండూరుకు చెందిన చంద్రయ్య సోదరుడితో కలిసి పొప్పడిపండ్లను అమ్మేందుకు మార్కెట్​కు వచ్చాడు. వేలంపాట నిర్వహిస్తుండగా జహంగిర్ అనే దళారి రెండు పండ్లు దొంగిలించే ప్రయత్నం చేశాడు. దీన్ని అడ్డుకోబోతుంటే దళారులంతా కలసి రైతుపై దాడి చేశారు.