- జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచాలి
- టార్గెట్ సాధించేందుకుప్లాన్ చేసుకోవాలి
- థర్మల్ ప్లాంట్లలో సరిపడాబొగ్గు నిల్వలు ఉంచుకోవాలి
- భారీ నష్టం జరిగే వరకు నిర్లక్ష్యం చేయొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కృష్ణ, గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
నిర్దేశించిన టార్గెట్సాధించేందుకు ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆ శాఖల సీఈలతో శనివారం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు భట్టి పలు సూచనలు చేశారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి.. జరిగిన భారీ నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రానివ్వొద్దని హెచ్చరించారు. వారానికి ఒకసారి జనరేషన్ ప్లాంట్ల పరిస్థితిని పర్యవేక్షించడంతోపాటు కరెంట్ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు తనకు పంపాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు సిద్ధం చేసుకోవాలి
థర్మల్ ప్లాంట్లలో 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు. అన్ని పవర్ జనరేషన్ ప్లాంట్ల నుంచి వీక్లీ రిపోర్ట్పంపాలని చీఫ్ ఇంజినీర్లను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల కోసం 24/7 పనిచేయడమని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు.
సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామని, పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు. 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని, ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, పరిష్కరించేందుకు సిద్ధమని అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. అధికారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. వెంటనే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహిస్తే రాతపూర్వకంగా వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
