కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు: భట్టి విక్రమార్క

కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు:  ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్​నేతలకు అవగాహన లేదంటూ కేసీఆర్​చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి మండిపడ్డారు. అసలు అవగాహన లేనిదే కేసీఆర్​కు అని ఫైర్​అయ్యారు. మంగళవారం గాంధీభవన్​వద్ద వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలపై కేసీఆర్​కే అవగాహన లేదని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఇరిగేషన్​ప్రాజెక్టులు, నీళ్లపై కాంగ్రెస్​కు అవగాహన ఉన్నది కాబట్టే నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్సారెస్పీ, కడెం వంటి పటిష్టమైన ప్రాజెక్టులను కట్టాం. కేసీఆర్​కు నీళ్ల మీద కనీస అవగాహన లేదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్​కు, మాకున్న తేడా అదే” అని విమర్శించారు.

రూ.94 వేల కోట్లతో కూలిపోయే కాళేశ్వరం లాంటి నాసిరకం ప్రాజెక్టులు కట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవాళ్లు కూడా తమపై ఆరోపణలు చేయడం దారుణమని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్​నీళ్లు తీసుకురావడంలో ఎక్స్​పర్ట్​కాదు. కానీ పైసలు ఎట్ల తేవాలన్న దాంట్లో మాత్రం ఎక్స్​పర్ట్. నీళ్ల పేరుతో దోచుకోవడంలో కేసీఆర్​స్పెషలిస్ట్” అని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకునేందుకు కేసీఆరే సహకరించారని, ఆయన ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై కేసీఆర్​ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపడం లేదని, ముందు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల గురించి మాట్లాడాలని అన్నారు. అన్ని విషయాలపైనా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.‌