
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-2025 విశ్వ విజేతగా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా నిలిచింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సఫారీ ఓపెనర్ మార్క్రమ్ (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించగా.. బవుమా (66) కెప్టెన్ ఇన్సింగ్ ఆడి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ విజేతగా నిలిపారు. ప్రొటిస్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం ఇదే తొలిసారి.
అంతేకాదు 27 ఏళ్ళ తర్వాత సఫారీ జట్టు ఐసీసీ టైటిల్ గెలిచింది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి ఐసీసీ టోర్నీ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తోంది. చాలా సార్లు సెమీస్, ఫైనల్కు వెళ్లిన సౌతాఫ్రికా తుది సమరంలో ఓటమి పాలు కావడం అనవాయితీగా మార్చుకుంది. దీంతో సౌతాఫ్రికాకు చోకర్స్ అనే ముద్ర పడింది. ఎట్టకేలకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచి.. చోకర్స్ అనే బిరుదును చెరిపేసుకుంది.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ విశ్వవిజేతగా నిలిచిన సౌతాఫ్రికాకు ఎంత ఫ్రైజ్ మనీ దక్కతుందనే దానిపై చర్చ జరుగుతోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ నిలిచిన సౌతాఫ్రికా జట్టుకు టెస్ట్ గదతో పాటు 3.6 మిలియన్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ. 31.05 కోట్లు) ప్రైజ్ మనీ దక్కనుంది. ఫైనల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా $2.16 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 18.63 కోట్లు) నగదు బహుమతి అందకోనుంది.
ఇక, 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో మూడో స్థానంలో నిలిచిన భారత్ రూ. 12.42 కోట్ల క్యాష్ రివార్డ్ అందుకోనుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్లో ఓటమి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలు కావడంతో భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్కు వెళ్లే అవకాశాన్ని చేజార్చుకుంది. 2025, జూన్ 20న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ తో 2025-2027 వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ సైకిల్ మొదలుకానుంది.