కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోఆదివారం భక్తులుపోటెత్తారు.దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నిద్రలేచి స్నానమాచరించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది.

అనంతరం గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఆలయ ఏఈవోలు శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఆలయ అర్చకుడు మల్లికార్జున్, ఒగ్గు పూజారులు భక్తులకు కావల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు బందోబస్తు నిర్వహించారు.

మల్లన్న లడ్డూ మరింత ప్రియం

మల్లికార్జున స్వామి లడ్డూ ప్రసాదం మరింత ప్రియంగా మారింది. ఆలయ అధికారులు లడ్డూ ధరలను పెంచారు. గతంలో 100 గ్రాముల లడ్డూ కు రూ. 20  ఉండగా ఆదివారం నుంచి రూ. 25 కు విక్రయిస్తున్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో లడ్డూ ధరలు పెంచినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.