సమ్మర్ హాలీడేస్ ముగుస్తుండటంతో తిరుమల కొండకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఎక్కువ మంది భక్తులు సొంత కార్లు, వాహనాలలో వస్తుండడంతో తిరుపతిలోని అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వాహనాల చెకింగ్ దగ్గర ఇబ్బందులు
అలిపిరి టోల్ గేట్ నుండి గరుడ సర్కిల్ దాటి లింక్ బస్టాండ్ వరకు వాహనాలు రోడ్డుపై కిలోమీటర్ల మేర లైన్లలో నిలిచిపోయాయి. దింతో సెక్యూరిటీ సిబందికి వాహనాలను తనిఖీ చేయడానికి గంటకు పైగా సమయం పడుతోంది. వేసవి ఎండలు, ట్రాఫిక్ వల్ల భక్తులు విసిగిపోతున్నారు. వాహనాల చెకింగ్ త్వరగా చేసి కొండపైకి పంపించాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
శ్రీవారి దర్శనానికి సమయం
తిరుమల కొండపై భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు శిలాతోరణం వరకు వచ్చాయి. దింతో ఉచిత సర్వదర్శనంకి సుమారు 20 గంటలు, SSD టోకెన్ల దర్శనానికి సుమారు 10 గంటలు, రూ. 300 ప్రత్యేక దర్శనంకి సుమారు 6 గంటలు పైగా పడుతోంది.
నిన్న ఒక్కరోజే 84,468 మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. 40,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 48 లక్షలు వచ్చినట్లు టిటిడి (TTD) అధికారులు చెప్పారు.
