
ప్రతి మనిషి జీవితాంతం తాను గత జన్మల్లో చేసిన కర్మలను అనుభవించాల్సి వస్తుంది. ఇవి వారి యోగాలపై ఆధారపడి ఉంటాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఙ్ఞాన యోగం ,,.. కర్మ యోగం ఉంటాయి. ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకుందాం. . .
శ్రీ కృష్ణుడు చెప్పిన మాటలు విన్న అర్జునుడు.. నాకు అంతా అయోమయంగా ఉంది. కర్మాచరణం కన్నా బుద్ధియోగం గొప్పది అని చెప్పి మళ్ళీ కర్మాచరణకి పురికొల్పుతున్నావేమిటి? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు బుద్ధియోగానికి ఆధార భూత మైన జ్ఞానయోగ, కర్మయోగలని గురించి వివరిస్తాడు. తానే ఈ రెండు మార్గాలని స్థిరీకరించానని చెప్పాడు. రెండూ కూడా ఒక దాని మీద మరొకటి ఆధారపడి ఉన్నట్టుగా వివరిస్తాడు.
జ్ఞానయోగాన్ని అనుసరించే వారు సాంఖ్యులు అని, కర్మయోగాన్ని అవలంబించే వారు యోగులు అని ప్రసిద్ధమయ్యారు. కర్మాచరణ చేయటానికి ముందు ఏం చెయ్యాలో తెలియాలి కదా. కనుక జ్ఞానం ప్రాధాన్యం వహిస్తుంది. తెలుసుకోకుండా పనులు చేసుకుంటూ పోతే పొరపాటు చెయ్యవచ్చు, దుష్కర్మలు చేసే అవకాశం ఉంది. కనుక ముందు జ్ఞానార్జన చెయ్యాలి అన్నది సాంఖ్యుల వాదన. జ్ఞానం పొందటానికి అర్హత ఉండాలి.
శారీరక, మానసిక, బుద్ధి అహంకారాల పరమైన పాత్ర ఉండాలి. ఈ నాలుగింటిలో దేనిలోనైనా పవిత్రత లోపిస్తే సరైన జ్ఞానదర్శనం కలుగదు. దేహానికి ఉన్న మలినం పోవాలి. మనసుకి ఉన్న వాసనలు కూడా నశించాలి. వాసనలు నశించటానికి సత్కర్మాచరణం మాత్రమే మార్గం. కనుక కర్మాచరణమే తగినది. తెలుసుకుని మిన్నకుంటే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టాలి కదా. ఆచరణ ప్రధానం అన్నది కర్మయోగుల వాదన.
తెలుసుకోవటం జ్ఞానయోగం అయితే, దానిని అమలు చెయ్యటం కర్మయోగం. రెండింటిలో ఏది లేకపోయినా వ్యవహారం సాగదు. ఉదాహరణకి ఒక పదార్ధం వందాలంటే ఎట్లా చెయ్యాలో అంటే వండే విధానం తెలుసుకోవాలి.. ఇది సాంఖ్యం. తెలిసినంత మాత్రాన పదార్థం సిద్ధం కాదు. పనిలో జొరబడి పొయ్యి వెలిగించటంతో మొదలుపెట్టాలి. ఇది కర్మ యోగం. మన కంటికి కనపడే అతి లౌకిక అంశానికే రెండూ అవసరమైనప్పుడు మోక్షం మొదలైన అలౌకిక, ఆధ్యాత్మిక అంశాలు సాధించటానికి జ్ఞానము, కర్మ రెండూ అవసరమని అర్ధమవుతూనే ఉంది. ఈ రెండింటిని ప్రవర్తింపజేసినది తానేనని రెండూ పరస్పరాధారితాలేనని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కనుక రెండూ అవసరమే.
అంతే కాదు, రెండూ పరస్పర పరిపోషకాలు, జ్ఞానం కర్మబంధాల నుండి విమోచనం కలిగిస్తుంది. కర్మాచరణం జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానార్జన, కర్మాచరణం మానవులందరికీ తప్పనిసరి. ఏదైనా నిర్మాణం చేయటానికి శాస్త్ర పరిజ్ఞానం, ఆచరణం రెండూ ఉండాలి కదా. ఎట్లా నిర్మాణం చెయ్యాలో తెలుసుకోకుండా పని మొదలు పెడితే అది అనుకున్నట్టు తయారవదు.
అర్జునుడు కర్మాచరణానికి సందేహించటానికి గల కారణాన్ని శ్రీకృష్ణుడు ఊహించగలడు. అందుకే దానికి సమాధానం చెబుతున్నాడు. ఏదైనా పని చేసినప్పుడు కర్మదోషం అంటుకుంటుంది కనుక సందేహిస్తున్నాడు. పనులు చేయటం మానినంత మాత్రాన కర్మ మానినట్టు అపదు. ఎందుకంటే, కర్మ చేయటం మానసికం, శరీరం కదలకపోయినా మనసు పని చేయకుండా ఉండలేదు. ఒక్క క్షణం కూడా మనోవ్యాపారం లేకుండా ఉండటం మనిషికి అసాధ్యం. అదే సిద్ధిస్తే సాధన సఫలమైనట్టే. అందరూ చేరుకోవాలనుకునే స్థితి అదే.
కర్మసన్యాసం చేసినంత మాత్రాన సన్యసించినట్టు కాదు. ఎవరైనా ఒక వ్యక్తిని బాధించినప్పుడు ఆ వ్యక్తి కదలలేని పరిస్థితుల్లో ఊరకున్నంత మాత్రాన మనసులో కోపం తెచ్చుకోలేదని అర్థం కాదు. శారీరకంగా ఏకర్మ చేయకపోయినా మనసు ఉద్రేకంతో ఊగిపోయింది కదా. దానిని కర్మ సన్యాసమని చెప్పగలమా?
పైగా జీవించి ఉన్నంత కాలం శరీరం గాలి పీల్చటం, తిన్నది అరిగించుకోవటం వంటి పనులు చేస్తూనే ఉంటుంది కదా.
పని చేయటం మానటం అంటే తన ప్రయత్నంతో చేసే పనులు మానటం సమస్యకి పరిష్కారం కాదు. ఎందుకంటే ఏ మానవుడు కూడా కర్మాచరణం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. కారణం ఏమంటే- చేసే పనులన్నీ స్వభావం అంటే ప్రకృతి నుండి బయలుదేరుతున్నాయి. ప్రకృతి నుండే త్రిగుణాలు పుడుతూ ఉంటాయి. వాటి ప్రేరణతో మనిషి పనులు చేస్తూ ఉంటాడు. అంటే, తనంతట తాను చేయటంకాక చేయించబడుతున్నాయి అని అర్ధం చేసుకోవాలి.
స్వభావం చాలా బలీయమైనది కనుక కర్మాచరణం అన్నది మనిషి అధీనంలో లేదు. శరీరంతో చేయకుండా ఉండవచ్చును. కాని, స్వభావం ఊరుకోదే. జ్ఞానేంద్రియాలని బల వంతంగా అణచి పెట్టవచ్చు కొద్దికాలం పాటు కాని, కర్మేంద్రియాలని అదుపు చేస్తే, వాటినే మానసికంగా తలచుకుంటూ ఉండటం జరుగుతుంది. ఉదాహరణకి కర్మేంద్రియాలైన కాళ్ళు, చేతులు, నోరు (మాట్లాడటం), జననేంద్రియాలు, విసర్జకావయవాలని బంధించి ఉంచటం సాధ్యమా? అప్పుడు మనసు వాటినే మరింత స్మరిస్తూ ఉంటుంది.
ఇంక కర్మసన్యాసం ఏమిటి? చేయవలసినది జ్ఞానేంద్రియాలని ప్రవర్తించకుండా అదుపు చేయటం కాని, కర్మేంద్రియాలని కాదు. జ్ఞానేంద్రియాలు శరీరం ఏ పని చేయకుండా ఉన్నా పనిచేస్తూనే ఉంటాయి. దానికి మార్గం మనసుకు మరొక పవిత్రమైన విషయాన్ని రుచి చూపి, లగ్నమయ్యేట్టు చేయటమే. అవి ఊరకుంటే కర్మేంద్రియాలు శరీర ధర్మానికి తగిన పనులని అసంకల్పితంగా చేసుకుపోతూ ఉంటాయి .
శరీరం లోపల ఉన్న గుండె. ఊపిరితిత్తులు, జీర్ణాశయం మొదలైన భాగాల లాగా మంచి పనులు చేసేట్టు కర్మేంద్రియాలని బుద్ధి ప్రేరేపిస్తూ ఉండాలి. ఇదే కర్మ యోగం. అప్పుడు కర్మలు అంటవు. పనులు మానటం సాధ్యం కాదని తేలింది కనుక కర్మేంద్రియాలని పని చెయ్యనియ్యటం మంచిది. ఆ పనులని బుద్ధి యోగంతో నిర్ణయించాలి. అప్పుడు కర్మేంద్రియాలు కూడని పనుల జోలికి పోవు. కర్మ జ్ఞాన యోగాల సమన్వయం తెలిస్తే సందేహం ఉండదు అని వివరించాడు శ్రీకృష్ణుడు...
-వెలుగు, లైఫ్–