హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పరిధిలో నిఘా పెంచాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. ఈ మేరకు రైల్వేస్టేషన్ల పరిధిలో సెక్యూరిటీపై ఆయన సోమవారం సమీక్ష జరిపారు. రైల్వేస్, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఈ మేరకు అదనపు సిబ్బంది కేటాయింపులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. రాష్ట్ర పరిధిలో 12 గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లు, 17 రైల్వే అవుట్ పోస్టులను పని చేస్తున్నాయని తెలిపారు. రైల్వేస్టేషన్లలోనూ సీసీ కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో అదనపు భద్రతపై చర్యలు తీసుకోవాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికపై డయల్ 100 లేదా 139 లేదా 1512లో సమాచారం ఇవ్వాలన్నారు. మహేశ్ భగవత్ మాట్లాడుతూ... రైల్వే ట్రాక్లపై ప్రమాదాలు అరికట్టేందుకు ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు , ఫెన్సింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా సికింద్రాబాద్, కాజీపేట రైల్వే జంక్షన్లలో స్నిఫర్ డాగ్స్ అందుబాటులో ఉంచాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సమీక్షలో ఆర్పీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమ సింగ్ ఠాకూర్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, హైదరాబాద్ అనూప్ కుమార్ శుక్లా , రైల్వే అడిషనల్ డీఆర్ఎం రాజీవ్ కుమార్ గంగెలే, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ జి. దామోదర్ రెడ్డి, రైల్వే ఎస్పీ సలీమా తదితరులు పాల్గొన్నారు.