
- పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆందోళన
- కోల్ డోజర్ల అడ్డగింత
నస్పూర్, వెలుగు: పెండింగ్ వేతనాలు చెల్లించాలని శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓపెన్ కాస్ట్ గనిలోని సీఆర్ఆర్ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సింగరేణి సంస్థ కోల్ రవాణా చేసే డోజర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనతో ఓవర్బర్డెన్ వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తమ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓసీపీ ఓబీ క్యాంపు ఆఫీస్ ఆవరణలో వంటావార్పు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సీఆర్ఆర్ఓబీ కంపెనీలో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, గడిచిన నాలుగు నెలలుగా కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించడంలేదన్నారు. జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను తీర్చడంలేదని, వెంటనే పెండింగ్ వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వారికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మద్దతు పలికారు.