
రాష్ట్రంలో డయాగ్నస్టిక్ హబ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది మే చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 20 డయాగ్నస్టిక్ హబ్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దీనిపై స్పెషల్ సీఎస్ శాంతికుమారి హెల్త్ ఆఫీసర్లతో సమీక్షించారు. మొత్తం ఐదు దశల్లో 20 హబ్లను ప్రారంభించాలని ఆఫీసర్లకు సూచించారు. తొలిదశలో కరీంనగర్, సిద్దిపేటల్లో హబ్లను ఈ నెల 28న మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారు. రెండో దశలో మూడింటిని, మూడోదశలో ఐదింటిని, నాలుగో దశలో నాలుగింటిని, మిగతావాటిని ఐదో దశలో ప్రారంభిస్తారు. మొత్తంగా పదిహేను రోజులకు ఒక దశ ఓపెనింగ్స్ జరుగనున్నాయి.
60 శాతం కేంద్ర నిధులతో..
రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నస్టిక్ హబ్స్ ఏర్పాటు చేయాలని 2017లో నిర్ణయించారు. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర సర్కారు మిగతా 40 శాతం భరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని డయాగ్నస్టిక్ హబ్ లో 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజూ 3 నుంచి 4 వేల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వచ్చే పేషెంట్ల శాంపిళ్లను ఈ హబ్లోనే టెస్ట్ చేస్తున్నారు. జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో ఎక్విప్ మెంట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు.