దుబాయ్: ఫామ్లేమితో తాను మానసికంగా కుంగిపోయానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఆసియా కప్కు ముందు తీసుకున్న నెల రోజుల విరామంలో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టలేదన్నాడు. ‘నేను మానసికంగా బలహీనపడుతున్నానని అంగీకరించడానికి సిగ్గుపడటం లేదు. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ దీని గురించి మాట్లాడటానికి సంకోచిస్తాం. మనల్ని మనం బలహీనులుగా చూసుకోలేం. కానీ వాస్తవం ఏంటంటే మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే మానసికంగా ధృడంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం. గత పదేళ్లలో ఫస్ట్ టైమ్ నెల రోజుల పాటు బ్యాట్ను తాకలేదు.
ఇటీవల కొన్ని రోజులుగా నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని అర్థం చేసుకున్నా. నాలో సామర్థ్యం ఉంది అని నాకు నేను సర్ది చెప్పుకునేందుకు ట్రై చేశా. కానీ శరీరం మాత్రం ఆగిపోమ్మని చెప్పింది. ఓ అడుగు వెనక్కి తగ్గాలని, విశ్రాంతి తీసుకోవాలని మనసు కూడా సూచించింది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రతి వ్యక్తికి మానసిక, ఆరోగ్య సమస్యలు ఉండటం వాస్తవమన్నాడు. తాను మానసికంగా బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రతి దానికి పరిమితులు ఉంటాయని కింగ్ కోహ్లీ వెల్లడించాడు. ఆ పరిమితులను గుర్తించకపోతే ప్రమాదకరంగా మారుతాయన్నాడు.