
- నేషనల్ కాంపా అథారిటీ జాయింట్ సీఈవో నిషాంత్ వర్మ
- అటవీ అనుమతుల కోసం ‘పరివేశ్ పోర్టల్’ను వినియోగించాలి: పీసీసీఎఫ్ సువర్ణ
హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖకు సంబంధించి యాన్యువల్ ప్లాన్ ఆపరేషన్స్ (ఏపీవో) ఆమోదానికి మాన్యువల్ పద్ధతిలో కాకుండా ఇకపై డిజిటల్ ఏపీవో, కేంద్ర ‘పరివేశ్ పోర్టల్’ ద్వారా మాత్రమే కొనసాగుతాయని నేషనల్ కాంపా అథారిటీ జాయింట్ సీఈవో నిషాంత్ వర్మ తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోని ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి నిర్వహణ, ప్రణాళిక (కాంపెన్సటరీ అఫారెస్టెషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ – -కాంపా)కు సంబంధించి అన్ని రాష్ట్రాలు డిజిటల్ కాంపా యాన్యువల్ ప్లాన్ ఆపరేషన్స్ (ఏపీవో) ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
సోమవారం హైదరాబాద్లో కేంద్ర పర్యావరణ శాఖ, జాతీయ కాంపా అథారిటీ, రాష్ట్ర అటవీ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ‘డిజిటల్ కాంపా ఏపీవో’పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్లో 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి డిజిటల్ ఏపీవో వినియోగంపై అవగాహన కల్పించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్, లక్షద్వీప్ల నుంచి వంద మంది అటవీ అధికారులు హాజరయ్యారన్నారు.
పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతూ.. ఇక నుంచి అటవీ అనుమతుల కోసం ‘పరివేశ్ పోర్టల్’ను వినియోగించాలని, దీని ద్వారా అనుమతుల్లో ఆలస్యం జరగదన్నారు. అటవీ శాఖకే పరిమితం కాకుండా ఇకపై ఇతర శాఖలు కూడా ఈ విధానం అవలంబిస్తే ప్రాజెక్టుల్లో వేగం పెంచడంతో పాటు క్లియరెన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కాంపా వార్షిక ప్రణాళికలను డిజిటల్ రూపంలో సమర్పించడం వల్ల కేంద్ర పర్యావరణ శాఖ త్వరితగతిన అనుమతులను ఆమోదిస్తుందని చెప్పారు. నేషనల్ కాంపా సీనియర్ కన్సల్టెంట్ నిశీత్ సక్సెనా మాట్లాడుతూ.. డిజిటల్ ఏపీవో ద్వారా ప్రణాళికలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రియాంక వర్గీస్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎస్జే ఆశ తదితరులు పాల్గొన్నారు.