
- జనవరిలో రూ. 51 లక్షల కోట్ల విలువైన డిజిటల్ పేమెంట్లు
- ఇప్పుడు విదేశాలలోనూ మన యూపీఐ, రూపే నెట్వర్క్లు
- గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
కొచ్చి: ఈ ఏడాది జనవరి నెలలో రూ. 51 లక్షల కోట్ల విలువైన 1,50 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు దేశంలో జరిగాయని, మన డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. పేమెంట్స్ సిస్టమ్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (యూపీఐ) ఒక రివల్యూషన్ తెచ్చిందని, జనవరి లో జరిగిన డిజిటల్ పేమెంట్లలో యూపీఐ ద్వారా రూ.13 లక్షల కోట్ల విలువైన 803 కోట్ల ట్రాన్సాక్షన్లు ప్రాసెస్ అయ్యాయని వెల్లడించారు. పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యపడిందని చెబుతూ, దీని ఫలితంగా గ్లోబల్ పేమెంట్స్ రంగంలో రిజర్వ్ బ్యాంక్ స్టార్ హోదా సంపాదించుకోలిగిందని దాస్ పేర్కొన్నారు. పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ల (పీఎస్ఓ) కాన్ఫరెన్స్లో ఆర్బీఐ గవర్నర్ పాల్గొన్నారు. ఇండియాలో పేమెంట్స్ స్వరూపమే మారిపోయిందని, అత్యాధునికంగా సాగుతోందని దాస్ చెప్పారు. మన తాజా పేమెంట్స్ సిస్టమ్ అందుబాటులో ఉండటమే కాకుండా, కన్వీనియెంట్గానూ, వేగంగానూ, భద్రంగానూ కూడా ఉందని పేర్కొన్నారు.
డిజిటల్తోనే ఎనీటైమ్..ఎనీవేర్ బ్యాంకింగ్
దేశంలో సుమారు 114 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లున్నాయని, ఇందులో 55 శాతం వాటా అర్బన్ ఏరియాలదైతే, మిగిలిన 45 శాతం రూరల్ ఏరియాలదని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతోపాటు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం డిజిటల్ పేమెంట్ల జోరు ఎక్కువవడానికి దారితీసిందన్నారు. బ్యాంకు బ్రాంచీల వర్కింగ్ అవర్స్తో సంబంధం లేకుండా ఎనీటైమ్..ఎనీవేర్ బ్యాంకింగ్ సాధ్యమవుతోందని పేర్కొన్నారు. డేటా విడుదలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్సపరెంట్గా వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది కూడా ఎకో సిస్టమ్లోని వారికి తెలుస్తోందని చెప్పారు. నగదు తక్కువగా ఉండే సమాజం వైపు చురుగ్గా కదలాలనేదే దీని వెనక ఉన్న ఉద్దేశమని పేర్కొన్నారు. ఇదే టైములో పేమెంట్ సిస్టమ్స్ ఆరోగ్యకరంగానూ ఉండేలా చూస్తున్నామని చెప్పారు.
కలిసి పనిచేద్దాం...పీఎస్ఓలకు పిలుపు
రెగ్యులేటరీ వ్యవస్థ తీసుకునే చర్యలను వెంటనే పేమెంట్సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్ఓ) వెంటనే అమలులోకి తేవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా సూచించారు. కలిసి పనిచేద్దాం....పేమెంట్స్ ఎకోసిస్టమ్ అందరికీ కలిసొచ్చేలా చూద్దామని పీఎస్ఓలకు దాస్ పిలుపునిచ్చారు. 2018 మార్చిలో తెచ్చిన డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ సెప్టెంబర్ 2022 నాటికి 377.46 పాయింట్లకు చేరిందని దాస్ వెల్లడించారు. మొదలు పెట్టినప్పుడు ఈ ఇండెక్స్ బేస్ 100 పాయింట్లని అన్నారు. మనం చాలా దూరం ప్రయాణించామనడానికి ఈ ఇండెక్స్ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. డిజిటల్ పేమెంట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు వచ్చే సమస్యలూ అలాగే పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఆపరేషనల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయని అన్నారు. కొత్తగా రాబోయే సవాళ్లకు ధీటైన రిస్క్మిటిగేషన్ చర్యలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఆయన సలహా ఇచ్చారు. మన సొంత పేమెంట్ ప్రొడక్టులైన యూపీఐ, రూపే నెట్వర్క్లు ఇప్పుడు గ్లోబల్ లెవెల్కు ఎదిగాయని, విదేశాలలో సైతం విస్తరిస్తున్నాయని దాస్ పేర్కొన్నారు.