అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరాకి రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా భాస్కర్ చెప్పిన విశేషాలు..
యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. లైఫ్ పార్టనర్ మన పక్కన ఉండటానికి, మన దగ్గర ఉండటానికి చాలా తేడా ఉంటుందని, సర్దుకుపోకుండా ఎలా ఉండాలో బాగా చూపించారంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. హ్యూమరస్గా చెప్పడంతో అందరికీ నచ్చుతోంది. టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాను. ఎమోషన్స్ని చక్కగా క్యారీ చేశారని చెబుతుంటే చాలా హ్యాపీ. కానీ ఓ రైటర్గా, డైరెక్టర్గా ఈ సినిమాలో ఇంకొన్ని విషయాలు చెప్తే బాగుండనిపించింది. ‘ఒంగోలు గిత్త’ తప్ప నేను చేసిన సినిమాలన్నీ నా లైఫ్లో ఏదో సందర్భంలో ఎక్కడో ఓ చోట ఫీలయ్యి రాసినవే. నా లైఫ్ను నేను ఎనలైజ్ చేసి దానిని కథగా మార్చుకుంటాను. ఈ సినిమా కోసం మ్యారేజ్ అనే పాయింట్ తీసుకున్నా. పెళ్లికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే వాటిని హైలైట్ చేశాను. నేననుకున్న దానిలో నలభైశాతం మాత్రమే ఫన్నీగా చూపించగలిగాను. లైట్ హార్టెడ్గా ఎంజాయ్ చేయాలని చాలా సింప్లీఫై చేసి తీశాను. థియేటర్లకొచ్చే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మెసేజ్ ఇవ్వాలనుకుంటాం. కానీ మెసేజ్ ఇవ్వడానికే సినిమా తీయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సక్సెస్, ఫెయిల్యూర్స్ ని నేనెప్పుడూ పట్టించుకోలేదు. ‘బొమ్మరిల్లు’ సక్సెస్ని కూడా రెండు రోజుల తర్వాత వదిలేశాను. ఫెయిల్యూర్స్ నుంచి మాత్రం నేర్చుకుంటాను. ఓటీటీలో నాకు ఎప్పుడో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇప్పటివరకు చేయలేదు. సినిమాలు చేస్తేనే ఓ కిక్ వస్తుంది. ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాను. త్వరలోనే అది రివీల్ చేస్తాను.