హైదరాబాద్, వెలుగు: రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రిష్ నిర్దోషని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాతే విచారణ చేపట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
క్రిష్ పిటిషన్పై వైఖరేంటో చెప్పాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కేసు వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు.