
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy), టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో(Leo). అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు కలెక్ట్ చేసి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
ఇక లియో భారీ విజయం సాదించడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు లోకేష్ లియో ప్రమోషన్ కోసం కేరళ వెళ్లారు. అక్కడ లియో ప్రదర్శితమవుతున్న థియేటర్స్ ను సందర్శించాడు. లోకేష్ వస్తున్నారన్న విషయం తెలుకున్న ఆయన అభిమానులు థియేటర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఓ థియేటర్ దగ్గర అపశృతి చోటుచేసుకుంది. లోకేష్ రాకతో పోలీసులు భారీ ఏర్పాట్లు చేసిన ఒక్కసారిగా జనాలు లోకేష్ మీదకు దూసుకువచ్చారు. దాంతో ఆయన ప్రమాదానికి గురయ్యారు. పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీ ఛార్జ్ చేసి అందర్నీ చెదరగొట్టారు పోలీసులు. ఈ కారణంగా లోకేష్ పాల్గొనాల్సిన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయ్యింది.
ఇక ఇదే విషయంపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు లోకేష్.. కేరళ అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. పాలక్కడ్లో మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అక్కడ వచ్చిన భారీ జనం వల్ల చిన్న గాయం అయింది.. ఆ కారణంగా మరో రెండు చోట్లకు వెళ్లలేకపోయాను. ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయ్యింది కానీ.. నేను మళ్లీ కేరళ వచ్చి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను... అని పేర్కొన్నారు లోకేష్.