టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కిష్టయ్య.. మంగళవారం రాత్రి (2025 నవంబర్ 25న) తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దర్శకుడు సంపత్ నంది భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘‘బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా.. ఇకపై అన్నీ నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి” అని తండ్రిపై ఉన్న ప్రేమను, ఆ బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇపుడు ఈ పోస్ట్ అందరినీ చలించేలా చేస్తుంది. ఈ క్రమంలో కిష్టయ్య మృతిపై టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సంపత్ నంది కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..
“నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లూ లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు!
చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది..
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది..
నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక..
మనం దున్నిన జంబు అరక..
పత్తి మందుకు పంపు..
పల్లి చేను లో సద్ది..
మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు..
ఇక అన్నీ జ్ఞాపకాలేనా?
దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు..
మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు..
ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా
నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని
నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప
వేరే ఏ సినిమా థియేటర్లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి
నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు..
ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో..
కానీ మళ్లీ రా.. బాపు..
నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి’’ అని సంపత్ నంది ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
సంపత్ నంది తెలుగులో స్టైలిష్ మేకింగ్కు కేరాఫ్ డైరెక్టర్గా నిలిచారు. రామ్ చరణ్ తో ‘రచ్చ’, రవితేజతో ‘బెంగాల్ టైగర్’, గోపీచంద్తో ‘గౌతమ్ నంద’ 'సీటీమార్’ సినిమాలను డైరెక్ట్ చేశారు. అలాగే, నిర్మాతగా, కథ రచయితగా కూడా రాణిస్తున్నారు. పేపర్బాయ్, ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ వంటి చిత్రాలకు కథ అందించారు. ప్రస్తుతం శర్వానంద్తో ‘భోగి’ మూవీ తెరకెక్కిస్తున్నారు.
