
ఉప్పునుంతల/ఖానాపూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని సీబీ తండా గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో కరెంట్షాక్తో ఓ యువకుడు చనిపోయాడు. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో భాగంగా సభావత్ లక్ష్మీపతి(25) డీసీఎం వ్యాన్ క్యాబిన్పై కూర్చున్నాడు. అయితే, ఊరి నుంచి వెళ్లే మెయిన్కరెంట్లైన్ కు తగలడంతో షాక్ కొట్టి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు.
అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సుభాష్ నగర్ కాలనీకి చెందిన వినాయకుడిని గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్ పై తీసుకువెళ్తున్నారు. ఆ టైంలో ట్రాక్టర్పై సూర రాకేశ్(15), ఒ. రాకేశ్(14), అల్లెపు అరవింద్(11) ఉన్నారు. ట్రాక్టర్ పై కట్టిన ఫ్లెక్సీ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తీగలకు తగలడంతో పిల్లలకు షాక్కొట్టింది. దీంతో కింద పడిపోయారు. వెంటనే వారిని గణేశ్ మండలి నిర్వాహకులు ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.
చెరువులో మునిగి ....
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లి చెరువులో పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఐత సారయ్య(38) బుధవారం వినాయక విగ్రహ నిమజ్జనాన్ని చూసేందుకు చెరువు దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడడంతో మునిగి గల్లంతయ్యాడు. డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
రెడ్డిపేటలో ఆగిన గుండె
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో నిర్వహించిన నిమజ్జనంలో గ్రామానికి చెందిన కొండ నరేశ్(30) పాల్గొన్నాడు. అతడికి గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. వెంటనే కామారెడ్డి జిల్లా హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. శోభాయాత్రలో డీజే సౌండ్కే హార్ట్స్ట్రోక్వచ్చి చనిపోయాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. నరేశ్కు గతంలో గుండె ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారు. నరేశ్కు భార్య వీణ, 11 నెలల కొడుకు ఉన్నాడు.
భైంసాలో ఉద్రిక్తత
భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కాలోని ఏరియాలో రెండున్నర గంటలకు డీజే పెట్టుకుని యువకులు డ్యాన్సులు చేస్తున్నారు. పోలీసులు త్వరగా వెళ్లాలని కోరారు. దీంతో యువకులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని యువకులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పలువురు యువకులు పోలీసుల తీరును నిరసిస్తూ కిసాన్ గల్లీలో ఆందోళనకు దిగారు.
పోలీసులు అకారణంగా దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు శోభాయాత్ర నిలిచిపోయింది. ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శోభాయాత్ర తిరిగి ప్రారంభమైంది. పోలీసులు ఎవరిపై లాఠీచార్జ్ చేయలేదని, ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఏఎస్పీ, సీఐ శ్రీను కోరారు.