హైదరాబాద్: దిశ ఘటన నిందితుల ఎన్కౌంటర్పై విచారణ చేస్తున్న సిర్పూర్కర్ కమిషన్.. ఆర్టీసీ ఎండీ, నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు నోటీసులు ఇచ్చింది. నాటి ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చేందుకు బుధవారం కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. అయితే ఎన్హెచ్ఆర్సీ సభ్యుల విచారణ ఇంకా ముగియకపోవడంతో ఆయనను మరో రోజు విచారణకు రావాలని చెప్పింది.
సజ్జనార్కు తొలిసారి పిలుపు
2019 నవంబర్లో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులు పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్కౌంటర్పై విచారణకు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పలు దఫాలుగా బాధిత కుటుంబాలను కలిసి విచారించింది. అలాగే నాడు ఎన్కౌంటర్కు బాధ్యులైన పోలీసులు, పంచనామా చేసిన మేజిస్ట్రేట్ సహా పలువురు అధికారులను ప్రశ్నించింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఎన్కౌంటర్ స్పాట్ను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యులను ప్రస్తుతం హైకోర్టు వేదికగా కమిషన్ రెండ్రోజులుగా విచారిస్తోంది. అయితే తొలిసారిగా సజ్జనార్ను విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన కమిషన్.. ఇవాళ కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులను ప్రశ్నించడం కొనసాగుతుండడంతో ఆయనను మరో రోజు రావాలని సూచించింది.